బీజేపీలోకి హరీశ్ రావు : మంత్రి కోమటిరెడ్డి జోస్యం

నవతెలంగాణ భువనగిరి: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ కీలక నేత, మాజీ మంత్రి హరీష్‌రావు బీజేపీ చేరుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఈ మేరకు హరీశ్ రావు బీజేపీ నేతలతో సంప్రదింపులలో ఉన్నారని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. భువనగిరిలో మంత్రి కోమటిరెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్‌ఎస్‌లో ప్రతిపక్ష నాయకుడి హోదా కేసీఆర్‌ తన కొడుకు కేటీఆర్‌కు ఇస్తే అల్లుడు హరీష్‌ పార్టీ నుంచి బయటకు వెళ్తాడు.. అలాగే, అల్లుడికి ఇస్తే కొడుకు బయటకు వెళ్లిపోతాడు. ఇందులో భాగంగానే హరీష్‌రావు బీజేపీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు చేస్తున్నాడని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఎదుర్కొనే శక్తి మాజీ సీఎం కేసీఆర్‌కు లేదు. అందుకే కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంలేదు. మీలాగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకుంటే బీఆర్‌ఎస్‌లో మిగిలేది నలుగురే. ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే ఆయనను కలిసి వినతి పత్రం ఇవ్వాలి. కానీ, కేసీఆర్‌ మాత్రం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కలిశాడని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై కోమటిరెడ్డి స్పందిస్తూ ఎల్‌ఆర్‌ఎస్‌పై గైడ్‌ లైన్స్‌ ఇంకా పూర్తి కాలేదు. అలాగే, తెలంగాణ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తే మోదీ కంటే ఎక్కువ మోజార్టీ వస్తుంది’ అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

Spread the love