భారీ వర్షాలు.. టాంజానియాలో 155 మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : తూర్పు ఆఫ్రికా దేశాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు టాంజానియా, కెన్యా, బురుండీల్లో వరదలు సంభవించాయి. దీంతో ఆయా దేశాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. పలు ప్రధాన నదులు ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు టాంజానియా దేశంలో సుమారు 155 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రధాని కాసిమ్‌ మజాలివా తాజాగా వెల్లడించారు. బలమైన గాలులు, వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పంట నష్టంతోపాటు రోడ్లు, వంతెనలు, రైల్వేలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పలు చోట్ల కొండచరియలు కూడా విరిగిపడినట్లు చెప్పారు. ఈ వర్షాల కారణంగా సుమారు 236 మంది గాయాలపాలైనట్లు తెలిపారు. 51 వేలకు పైగా ఇల్లు ధ్వంసమయ్యాయని, సుమారు రెండు లక్షల మంది వరదలకు ప్రభావితమయ్యారని ప్రధాని కాసిమ్‌ పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్‌ సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వివరించారు. మే నెలలో కూడా వర్షాలు కొనసాగుతాయని కాసిమ్‌ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభావిత ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

Spread the love