కాంగ్రెస్లో హన్మంతన్న రూటే సఫరేట్. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే. ఇటీవల అనారోగ్యం పాలై మంచం పట్టాడు. కోలుకుని తిరిగి గాంధీభవన్కు వచ్చారు. అక్కడి రావడంతో హడావుడి చేశారు. అందర్ని పలకరించారు. చాలా రోజులైంది ఆయన మాటలినక. ఆయనకు నచ్చకపోతే సొంత పార్టీ వారిని చూడరు. పక్క పార్టీ వారని కూడా చూడరు. చివరకు అధిష్టానం పెద్దలైనా సరే ఆయన పంచులు వేస్తారంతే. ప్రతిపక్షంలో ఉండి ఆ నాటి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి కంటే ఆయనే ఎక్కువగా తిరిగారని ఆయనకు పేరుంది. ఆ తర్వాత అధ్యక్షుడిగా వచ్చిన రేవంత్రెడ్డిని కూడా వదిలి పెట్టలేదు. కానీ రేవంత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీకి వచ్చిన ఊపుతో హన్మంతన్న కొంత వెనక్కి తగ్గారు. రేవంత్ను ఆకాశానికెత్తారు. అధికారం వచ్చిన తర్వాత కొన్నాళ్లకు ఆయన అనారోగ్యం పాలై…రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. కానీ ఇవాళ రేవంత్రెడ్డితో మాట్లాడుదామంటే తనకు సమయం ఇవ్వట్లేదని వాపోయారు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడి చేస్తున్నవారిని కాదని, కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టిన వారిని పార్టీలో చేర్చుకుని, వారికి రెడ్ కార్పెట్ వేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని గళాన్ని వినిపించారు. ‘రేవంత్ ఇజ్జత్ తీసుకోకు’ అన్నారు. దటీజ్ హన్మంతన్న.
– గుడిగ రఘు