వెంటాడి.. వేటాడి..!

వెంటాడి.. వేటాడి..!– కేసు వెనక్కి తీసుకోలేదని యూపీలో లైంగికదాడి బాధితురాలి దారుణహత్య
లక్నో: కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిందన్న అక్కసుతో లైంగికదాడి బాధితురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన యూపీలో జరిగింది. మూడేండ్ల క్రితం మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. వెంటాడి… గొడ్డలితో నరికి చంపిన ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ కౌషంబి జిల్లాలోని దేర్హా గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మూడేండ్ల క్రితం మైనర్‌ బాలిక (ఇప్పుడు ఆమె వయసు 19 ఏండ్లు) పై తన స్నేహితులతో కలిసి లైంగికదాడికి పాల్పడిన కేసులో పవన్‌ నిందితుడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. అయితే అప్పటినుంచి కేసు వెనక్కి తీసుకోవాల్సిందిగా బాధిత కుటుంబాన్ని, యువతిని వేధిస్తూనే ఉన్నాడు. దీనికి వారు ససేమిరా అనడంతో మరింత కక్ష పెంచుకున్నాడు. రెండు రోజుల క్రితం బెయిల్‌పై వచ్చిన పవన్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
సరిగ్గా ఇదే సమయానికి మరో హత్య కేసులో నిందితుడిగా జైలుకెళ్లిన అతని సోదరుడు అశోక్‌ నిషాద్‌ కూడా బయటి కొచ్చాడు. ఇద్దరూ కలిసి వారిని బెదిరించి, కేసు క్లోజ్‌ చేయాలని ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో పథకం ప్రకారం బాధిత యువతి పశువులను మేతకు తీసుకెళ్లి, తిరిగి వస్తుండగా, ఆమెపై దాడి చేశారు. వెంటాడి గొడ్డలితో నరికి చంపారు. దీంతో స్థానికులు సైతం భయాందోళనకు లోనయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. నిందితుల అరెస్టుకు బృందాలను ఏర్పాటు చేశామని కౌశాంబి ఎస్పీ బ్రిజేష్‌ శ్రీవాస్తవ తెలిపారు. యూపీలో నేరస్థులు రెచ్చిపోతున్నారనీ, వారికి ఎలాంటి చట్టాల పట్ల భయంగానీ, గౌరవంగానీ లేదంటూ కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది.

Spread the love