హైదరాబాద్ : ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పిహెచ్ఎల్) తొలి సీజన్కు తెలుగు టాలన్స్ ఉత్సాహంగా సన్నద్ధమవుతుంది. జూన్ 8న జైపూర్లోని సవారు మాన్సింగ్ స్టేడియంలో ఆరంభం కానున్న పిహెచ్ఎల్లో తెలుగు టాలన్స్ తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తుంది. సోమవారం జెఎన్టియుహెచ్లో జరిగిన ఓ కార్యక్రమంలో టాలన్స్ జెర్సీ ఆవిష్కరణతో పాటు కెప్టెన్ పేరును ప్రకటించారు. ఆకుపచ్చ, పసుపు రంగుతో కూడిన జెర్సీని జెఎన్టియుహెచ్ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. నరసింహా రెడ్డితో కలిసి ఐటీ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్లు ఆవిష్కరించారు. హర్యానా స్టార్ ఆటగాడు, జాతీయ స్థాయిలో మూడు కాంస్య పతకాలు సాధించిన జట్టులో సభ్యుడు, ఫెడరేషన్ కప్ నెగ్గిన జట్టులో సభ్యుడు శుభమ్ షియోరాన్ తెలుగు టాలన్స్ జట్టుకు కెప్టెన్సీ వహించనున్నాడు. ఈ మేరకు తెలుగు టాలన్స్ యజమాని అభిషేక్ రెడ్డి తెలిపారు. జెఎన్టియుహెచ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో హ్యాండ్బాల్ క్రీడాకారులు, విద్యార్థులు, తెలుగు టాలన్స్ కోచ్ ఫెర్నాండో, సహాయక కోచ్ సచిన్ పాల్గొన్నారు.