తల్లిదండ్రులు మందలించారని.. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థి ఆత్మహత్య

నవతెలంగాణ -తాడ్వాయి
ఈనెల 10న వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్‌ కాగా బాగా చదివి సప్లమెంటరీ పరీక్షల్లోనైనా పాస్‌ అవ్వాలని తల్లిదండ్రులు మందలించ డంతో.. విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం వీరాపూర్‌లో బుధవారం జరిగింది. తాడ్వాయి ఎస్‌ఐ వెంకటేశ్వర రావు తెలిపిన వివరాల ప్రకారం.. రంగాపూర్‌ గ్రామపం చాయతీ పరిధి వీరాపూర్‌ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు పెనక విశ్వనాథంకు కుమారుడు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు పెనక వివేక్‌(17) హనుమకొండలోని జ్యోతిరావు పూలే ఆశ్రమ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. కాగా ప్రథమ సంవత్సరం ఫెయిల్‌ అయ్యాడు. దీంతో ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షల్లో బాగా కష్టపడి చదివి పాస్‌ కావాలని మందలించారు. దాంతో మనస్తాపానికి గురైన వివేక్‌ ఈ నెల 15న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బీరెల్లి సర్పంచ్‌ జాజ చంద్రం హుటాహుటిన ములుగు ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Spread the love