నిహారిక కొణిదెల, వైవా హర్ష , అక్షయ్, సాయి రోనక్, భావనలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్’. అక్షయ్ పూల్ల అందించిన కథతో ఆదిత్య మందల ఈ ప్రాజెక్ట్ని రూపొందించారు. బీబీసీ స్టూడియోస్ ఇండియన్ ప్రై.లి., తమడా మీడియా ప్రై.లి బ్యానర్ల మీద సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్ర, రాహుల్ తమడా ఈ వెబ్ సిరీస్ను నిర్మించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ, ‘ఇది యువతకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే వెబ్ సిరీస్. ఒక్కో పాత్రకు ఒక్కో కారెక్టరైజేషన్ ఉంటుంది. జీవితంలోని ఒక్కో దశకు ఒక్కో పాత్ర ప్రతీకగా ఉంటుంది. నిహారిక చేసిన పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయి’ అని తెలిపారు.’ఇది నాకు ఎంతో ప్రత్యేకం. నన్ను నేను కూడా గాయత్రి పాత్రలో ఊహించుకోలేను. కానీ మా దర్శకుడు ఆదిత్య నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చారు. ఏ వయసు వాళ్లైనా ఈ వెబ్ సిరీస్ను చూడొచ్చు. అయితే యంగ్ జనరేషన్కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది’ అని నిహారిక చెప్పారు.