కుట్రల వ్యూహం..

Conspiracy strategy..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హఠాన్మరణం తర్వాత చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో దర్శకులు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘వ్యూహం’. రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ నిర్మిస్తున్నారు. వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాత్రలో అజ్మల్‌ నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం టీజర్‌, పోస్టర్స్‌ విడుదల చేశారు.
ఆదివారం రెండో టీజర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘కుట్రలకు, ఆలోచనలకు మధ్యలో అసమాన్యుడిగా ఎదిగిన నాయకుని కథే ‘వ్యూహం’. ఆ నాయకుడే వైయస్‌ జగన్‌. ఈ రెండో టీజర్‌లో నాయకునిగా జగన్‌ ఎదిగిన క్రమాన్ని చూపించారు. ‘నిజం తన షూ లేస్‌ కట్టుకునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుంది’ అని జగన్‌ ఆవేదన చెందిన సందర్భాన్ని ఇందులో చూపించారు. వైయస్‌ కుటుంబంలో జరిగిన పరిస్థితులతో పాటు ప్రత్యర్థి రాజకీయ శిబిరాల్లో జరిగిన వ్యూహాలకు కూడా టీజర్‌ అద్దం పట్టింది. ఈ సినిమా చిత్రీకరణ 50 శాతానికి పైగా పూర్తి అయ్యింది. అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత దాసరి కిరణ్‌ తెలిపారు. ఇందులో వైయస్‌.భారతీ పాత్రలో మానస నటిస్తున్నారు. ధనుంజరు ప్రభునే, సురభి ప్రభావతి, రేఖా సురేఖ, వాసు ఇంటూరి, కోటా జయరాం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డి.ఓ.పి: సుజీష్‌ రాజేంద్రన్‌, ఎడిటర్‌: మనీష్‌ థాకూర్‌.

Spread the love