నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు..!

నవతెలంగాణ-హైదరాబాద్ : కెనడా పౌరుడు, సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు తాజాగా ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా వారి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు శుక్రవారం నిందితులను అరెస్టు చేశారు. రెండు ప్రావిన్సుల్లో ఒకేసారి రెయిడ్లు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కెనడా బ్రోడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఓ వార్తను ప్రస్తారం చేసింది. అయితే కెనడా పోలీసులు మాత్రం ఇంకా స్పందించలేదు. గతేడాది జూన్ 18న సర్రీలోని ఓ గురుద్వారాలో ప్రార్ధన ముగించుకుని బయటకు వచ్చిన నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తలు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. తాజాగా టొరొంటోలో జరిగిన ఖల్సా డే కార్యక్రమంలోనూ ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నిజ్జర్ హత్య గురించి ప్రస్తావించారు. ఈ హత్య కెనడా అంతర్గత భద్రతకు ఓ సవాలని పేర్కొన్నారు. ఈ హత్య వెనక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని పునరుద్ఝాటించారు. కెనడా ప్రధాని వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ‘‘ప్రధాని ట్రూడో గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కెనడాలో వేర్పాటువాదానికి, హింసకు, తీవ్రవాదానికి రాజకీయ ప్రాముఖ్యత ఉన్న విషయాన్ని ఆయన వ్యాఖ్యలు ఎత్తి చూపుతున్నాయి’’ అని కెనడా విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌దీప్ జైశ్వాల్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, భారత్‌లోని కెనడా డిప్యుటీ హైకమిషనర్‌కు పిలిపించుకుని కేంద్ర ప్రభుత్వం తన నిరసన వ్యక్తం చేశారు. ట్రూడో హాజరైన కార్యక్రమంలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రత్యేక ఖలిస్థానీ దేశ ఏర్పాటును డిమాండ్‌ చేస్తున్న నిజ్జర్‌ను ఉగ్రవాదిగా గుర్తించిన భారత్.. అతడిని పలు టెర్రర్ కేసులకు సంబంధించి వాంటెడ్ లిస్టులో చేర్చింది.

Spread the love