రాష్ట్రాన్ని మోసగించిన ప్రధాని విభజన హామీల ప్రస్తావనేది?

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర విభజన హామీల ప్రస్తావన చేయకుండా తెలంగాణ ప్రజలను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మరోసారి మోసగించారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీని అటకెక్కించి, తొమ్మిదేండ్ల తర్వాత వ్యాగన్‌ వర్క్‌షాపునకు శంఖుస్థాపన చేయడమంటే..ప్రజల్ని మోసగించడమేననీ విమర్శించారు. ‘మోడీ పర్యటన సందర్భంగా విభజన చట్టం హామీల గురించి ప్రస్తావిస్తారని రాష్ట్ర ప్రజలు ఆశించారు. వరంగల్‌కు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని
రాష్ట్రాన్ని మోసగించిన ప్రధాని కేటాయించినప్పటికీ ఆ ఫ్యాక్టరీని తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు తరలించుకుపోయి తెలంగాణకు తీరని అన్యాయం చేసిన ఘనుడు నరేంద్ర మోడీ. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్‌ యూనివర్సిటీ, ఐటీఐఆర్‌ ప్రాజెక్టు గురించి మాట మాత్రమైనా ప్రస్తావించలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ చేయకుండా, కృష్ణా-గోదావరి బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం రాష్ట్రాల మధ్య తగాదాను పెంచింది. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ ప్రాజెక్టు హౌదా ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను కేంద్రం తన అధీనంలోకి తీసుకుంటూ గెజిట్‌ పబ్లికేషన్‌ చేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్తు ఉత్పత్తి, ఆస్తుల పంపిణీకి పరిష్కారం చూపలేదు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానన్న నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడంలేదని మాట్లాటం హాస్యాస్పదం. ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించి కేంద్ర ప్రభుత్వం కూలీల పొట్ట కొడుతున్నాడు. రైతు ఉత్పత్తులకు మోడీ ప్రకటించిన కనీస మద్దతు ధరలు కార్పొరేట్లకు లాభం చేయడానికే తప్ప అందులో శాస్త్రీయత లేదు. తొమ్మిదేండ్లుగా రాష్ట్రం ప్రకృతి వైఫరీత్యాలతో అతలాకుతలమై 32వేల కోట్లు నష్టపోగా కేంద్రం కక్షపూరితంగా ఎలాంటి సహాయమూ చేయలేదు. తక్కువ నష్టం జరిగినా బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం నిధులు కేటాయించింది. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సిన నిధులును వెంటనే విడుదల చేయాలి. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలి’ అని తమ్మినేని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Spread the love