నిస్వార్థంగా అభిమానించే వారికి మాత్రం ఎప్పుడూ తోడుగా ఉంటా: జగపతి బాబు

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు జగపతి బాబు ‘ఎక్స్’ వేదికగా కొందరు అభిమానుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై తాను అభిమాన సంఘాలకు, ట్రస్టుకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అభిమానం పేరిట తాను ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 33 ఏళ్లుగా అభిమానులు తన కుటుంబంగా, శ్రేయోభిలాషులుగా తన ఎదుగుదలకు కారణమయ్యారని జగపతిబాబు గుర్తు చేసుకున్నారు. తనూ అభిమానుల కష్టసుఖాల్లో తోడుగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అభిమానుల ఇబ్బందులు తనవిగా భావించి వారికి అండగా నిలిచానన్నారు. అయితే, కొంతమంది మాత్రం అభిమానం కంటే తన నుంచి ఆశించడం ఎక్కువైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానం పేరిట తాను ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. దీంతో, ఇకపై అభిమాన సంఘాలు, ట్రస్టుకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తేల్చి చెప్పారు. అయితే, తనపై ప్రేమ కురిపించే అభిమానులకు మాత్రం ఎప్పుడూ తోడుగా ఉంటానని పేర్కొన్నారు. మరోవైపు, నెటిజన్లు జగపతి బాబుకు అండగా నిలుస్తున్నారు. ఆయన నిర్ణయం సమర్థనీయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Spread the love