అప్పుల ఊబిలో కర్నాటక

– ప్రతి ఓటరు పైనా రూ. 1.2 కోట్ల రుణ భారం
– సంక్షేమానికి అరకొర కేటాయింపులే
– 10న తేలనున్న బీజేపీ ప్రభుత్వ భవితవ్యం
బెంగళూరు :
కర్నాటకలో ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసింది. ఈ నెల 10న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి ఓటమి తప్పదని పలు ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేయడానికి బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు సైతం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. కర్నాటకలో బీజేపి తిరిగి అధికారంలోకి రావడం కష్టమేనని మెజారిటీ సర్వేలు తేల్చేశాయి. దేశంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాలలో కర్నాటకది నాలుగో స్థానం. ఆధునిక పరిశ్రమలకు కూడా అది కేంద్ర స్థానంగా కొనసాగుతోంది. అయినప్పటికీ గత నాలుగేండ్లలో బీజేపీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసింది.
ఆర్‌బీఐ క్రోడీకరించిన రాష్ట్రాల బడ్జెట్ల సమాచారం ప్రకారం ఈ సంవత్సరం మార్చి నాటికి కర్నాటక అప్పుల భారం రూ. 5.35 లక్షల కోట్లకు చేరింది. 2018లో ఈ అప్పులు కేవలం రూ. 2.46 కోట్లు మాత్రమే. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఓటరు తల పైనా 1,02,107 రూపాయల రుణ భారం పడుతోంది. గత ఐదేండ్లలో తలసరి అప్పు 106 శాతం పెరగడం (2018లో ఇది రూ. 49,505 మాత్రమే) ఆందోళన కలిగిస్తోంది. నూతన రంగాలలో పెట్టుబడుల కోసం అప్పులు చేయక తప్పదని పాలక పక్షాలు వాదిస్తుంటాయి. 2017లో కేంద్రం జీఎస్‌టీ విధించిన తర్వాత రాష్ట్రాలకు కేంద్ర సాయం తగ్గిపోయింది. రుణాలు సైతం అందడం లేదు. ఇలాంటి పరిస్థితులలో అప్పులు అనివార్యమని రాష్ట్రాలు చెబుతున్నాయి. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. పైగా కోవిడ్‌ అనంతర పరిస్థితులను ఎదుర్కోవడానికి పెడుతున్న ఖర్చులో రాష్ట్రాలే ఎక్కువగా భరించాల్సి వస్తోంది. అయినప్పటికీ సామాజిక రంగాలపై ప్రభుత్వాలు తగినంత మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. అయితే కర్నాటకలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. 2022-23 బడ్జెట్‌లో కర్నాటకలోని డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం మొత్తం వ్యయంలో విద్యపై కేవలం 12 శాతం మాత్రమే ఖర్చు చేస్తానని ప్రతిపాదించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సగటున విద్యకు కేటాయించిన 13.6 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. అదే విధంగా వైద్యం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం పద్దుకు కేటాయించింది 5.4 శాతమే. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ రంగానికి సగటున కేటాయించిన 5.7 శాతం నిధులతో పోల్చినా కూడా ఇది తక్కువే. వాస్తవానికి విద్యా రంగంపై 2019-20లో కర్నాటక ప్రభుత్వం 12.4 శాతం ఖర్చు చేయగా 2022-23 నాటికి అది 12 శాతానికి తగ్గిపోయింది. వైద్యం, ప్రజారోగ్యంపై 2019-20లో 4.1 శాతం ఖర్చు చేయగా కోవిడ్‌ అనంతరం ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా 2021-22 (సవరించిన అంచనాలు)లో 5.8 శాతం ఖర్చు చేశారు. అయితే ఆ తర్వాత ఈ రంగంపై వ్యయం తగ్గుతూ వచ్చింది. 2022-23లో 5.4 శాతం మాత్రమే ఖర్చు చేశారు. బీజేపీ ప్రభుత్వం రుణాల ద్వారా సమీకరించిన వనరులను ప్రజా సంక్షేమానికి వెచ్చించడంలో విఫలమైంది. 2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) అభివృద్ధి వ్యయం 9.4 శాతం ఉండగా 2021-22 నాటికి 8 శాతానికి, 2022-23 బడ్జెట్‌ అంచనాలలో 7.6 శాతానికి తగ్గింది. అదేవిధంగా 2020-21లో సామాజిక రంగంపై జీఎస్‌డీపీలో ఐదు శాతం ఖర్చు చేయగా అది 2021-22లో 4.9 శాతానికి, 2022-23లో 4.5 శాతానికి తగ్గింది. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమంటే బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు అప్పుల ద్వారా వనరులు సమీకరిస్తాయి. ముఖ్యంగా వాణిజ్య లేదా మార్కెట్‌ నుంచి రుణాలు పొందుతాయి. కానీ విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం వంటి ప్రజా సంక్షేమ చర్యల కోసం మాత్రం నిధులు విదల్చవు. బహుశా ఈ రుణాలను మూలధనపు వ్యయం కోసం ఉపయోగిస్తూ ఉండవచ్చు. అంటే మౌలిక సదుపాయాల కల్పన వంటి పద్దుల కోసం వ్యయం చేయవచ్చు. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ వ్యయం కూడా సరిగా ఉండడం లేదు. 2020-21లో జీఎస్‌డీపీలో మూలధనపు వ్యయం కోసం 2.6 శాతం కేటాయించగా 2021-22లో 1.9 శాతానికి తగ్గిపోయింది. 2022-23లో కూడా బడ్జెట్‌ అంచనాలు అదే విధంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కేటాయింపు చాలా తక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే కర్నాటకలో వివిధ రంగాలకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కేటాయింపులు చాలా తక్కువగా ఉంటున్నాయి. అభివృద్ధి వ్యయం కోసం ఇతర ప్రాంతాలు 12.5 శాతం కేటాయిస్తే కర్నాటక కేవలం 7.6 శాతం, సామాజిక రంగానికి ఇతర ప్రాంతాలు 8.4 శాతం కేటాయిస్తే కర్నాటక 4.5 శాతం, మూలధనపు వ్యయానికి ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 2.9 శాతం కేటాయిస్తే కర్నాటక 1.9 శాతం మాత్రమే కేటాయించింది.
కర్నాటకలో సంక్షేమ రంగాలకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరకొర కేటాయింపుల కారణంగా సామాన్య ప్రజానీకానికి పెద్దగా ఒరిగిందేమీ లేదు. దీనితో పాటు ప్రభుత్వంలో అవినీతి పెచ్చరిల్లిపోయిందన్న విమర్శల జడివానలో బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వం తడిసి ముద్దవుతోంది. వీటన్నింటి నడుమ కర్నాటక ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Spread the love