మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్

– మంత్రి కేటిఆర్ ఆదేశాలతో ట్రయల్ రన్
– మంగళవారం ఉదయం 07.00 గంటలకు మల్కపేట జలాశయంలోకి గోదావరీ జలాలను ఎత్తిపోత
– త్వరలోనే మల్కపేట రిజర్వాయర్‌ ప్రారంభానికి సన్నాహాలు.
నవతెలంగాణ – సిరిసిల్ల/కోనరావుపేట
కోనా రావుపేట మండలం మల్కపేట గ్రామంలో ప్యాకేజీ – 9 లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 3 టీఎంసీ సామర్థ్యం గల  మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్ రన్ ను చేపట్టేందుకు అధికారులు పక్షం రోజులుగా క్షేత్ర స్థాయిలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పంపుహౌస్‌లో మోటర్లను ప్రారంభించి గోదావరి జలాలను మంగళవారం ఉదయం సరిగ్గా 07.00 గంటలకు మల్కపేట జలాశయంలోకి ఎత్తి పోశారు. ట్రయల్ రన్ పనులను ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎన్.వెంకటేశ్వర్లు, ఎత్తి పోతల సలహాదారు పెంటా రెడ్డి, ఎమ్ అర్ కేఆర్,డబ్ల్యూపిఎల్ ఏజెన్సీ ల ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ట్రయల్ రన్ ఎప్పటి కప్పుడు ట్రయల్ రన్ పై అధికారులను ఆరాతీస్తూ సజావుగా జరిగేలా మార్గనిర్దేశం చేశారు. ప్యాకేజీ -9 కార్యనిర్వహక ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి. ట్రయల్ రన్ సమన్వయ బాధ్యతలు చూసారు. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో 60 వేల కొత్త ఆయకట్టు కు సాగునీరు అందడంతో పాటు 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటిసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. బీడు భూముల సస్యశ్యామలం కానున్నాయి. రూ.504 కోట్లతో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్‌ ను త్వరలోనే ప్రారంభించనున్నారు.

Spread the love