కాంగ్రెస్ లో భారీగా చేరికలు

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ నందు మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గం సాలూర మండలానికి చెందిన సుమారు 150 మంది బీఆర్ ఎస్, బీజేపీ కార్యకర్తలు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరడం జరిగింది. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి  మాట్లాడుతూ.. యువకులు మహిళలు అందరూ కష్టపడి పనిచేసి బోధన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని, కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆయన అన్నారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ , బీజేపీ పార్టీలు రాష్ట్రాన్ని దేశాన్ని అధికంగా దోచుకున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పిన విధంగా దేశంలో బీజేపీకి కూడా బుద్ధి చెప్తారని, పది సంవత్సరాలుగా బీజేపీ దేశాన్ని వెనక్కి నెట్టిందని, వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కూడా చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాలూర మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కానీ ఈ పది సంవత్సరాలలో ఒక కార్యక్రమం కూడా జరగలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపించే విధంగా ప్రజలకు సేవ చేసే ఆలోచనతో పార్టీలోకి వచ్చిన మహిళలకు యువకులకు నాయకులకు కార్యకర్తలకు సుదర్శన్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, బోధన్ నియోజకవర్గ వివిధ మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love