మోడీ సర్కారు చేసిన అప్పు కనిపించట్లేదా? : మేడే రాజీవ్‌సాగర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ అప్పులపై మాట్లాడుతున్న కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి తొమ్మిదేండ్లలో మోడీ సర్కారు చేసిన రూ.100 లక్షల కోట్ల అప్పు కనిపించడం లేదా? అని తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ ప్రశ్నించారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఎస్‌ సర్కారుకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూడలేకే బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులు తీసుకురావడం తెలియని కిషన్‌రెడ్డికి.. నిందలేయడం మాత్రం బాగా వచ్చని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సర్కార్‌ తీసుకువచ్చిన అప్పుతో ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సాగునీరు అందిస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పుతో ఏం సాధించారో చెప్పగలరా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ రూ. 7వేల కోట్ల భూములు అమ్మిందని గగ్గోలు పెట్టే బీజేపీ నేతలకు లక్ష కోట్ల ప్రభుత్వ రంగ సంస్ధలను మోడీ అమ్మితే కనిపించడం లేదా? అని నిలదీశారు. 14 మంది ప్రధాన మంత్రులు రూ.55 లక్షల కోట్ల అప్పు చేస్తే.. తొమ్మిదేండ్లలో ప్రధాని మోడీ ఒక్కడే 100లక్షల కోట్ల అప్పు చేశాడనే విషయం కండ్లకు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే మోడీ చేసిన అప్పుపై ప్రశ్నించాలని సవాల్‌ విసిరారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్ధిక క్రమశిక్షణలో తో ముందుందని పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటిస్తే..ఇక్కడ బీజేపీ గల్లీ నేతలు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love