హైదరాబాద్‌ భవిష్యత్‌ కోసమే మెట్రో విస్తరణ


– నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గేలా చర్యలు
– విశ్వనగరంగా మారాలంటే ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయాల్సిందే : మంత్రి కేటీఆర్‌
– ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రత్యేక చర్చ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

హైదరాబాద్‌ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను భారీగా విస్తరిస్తూ, బలోపేతం చేయాలన్న దిశగా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నదని, ఈ దిశగా మెట్రో రైల్‌ విస్తరణ పనులను కూడా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అంతకంతకు విస్తరిస్తు న్న నగరంలోని ట్రాఫిక్‌ రద్దీని, కాలుష్యాన్ని తగ్గిస్తూ విశ్వ నగరంగా మార్చా లన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో నగరానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. మెట్రో రైల్‌ మాస్టర్‌ ప్లాన్‌, ఎయిర్‌పోర్ట్‌ మెట్రో వ్యవస్థఃపై గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు మెట్రో రైల్‌ను విస్తరించే కార్యక్రమాల తాలూకు ప్రణాళికలను సిద్ధం చేస్తూనే ప్రస్తుత మెట్రో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారిడార్లలో మరిన్ని అదనపు కోచ్‌లని పెంచాలని సూచించారు. మెట్రో లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీపై దష్టి సారించి మరిన్ని ఫీడర్‌ సర్వీస్‌లను ప్రారంభిస్తే ప్రస్తుతం ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్న సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షాసమావేశంలో మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ వేతో పాటు ప్రభుత్వం ప్రకటించిన మెట్రో రైల్‌ మాస్టర్‌ ప్లాన్‌పై తమ వద్ద ఉన్న ప్రణాళికల గురించి సవివరమైన ప్రజెంటేషన్‌ను అందించారు. అనేక సవాళ్లను అధిగమించి హైదరాబాద్‌ మెట్రోరైల్‌ మొదటి దశను విజయవంతంగా పూర్తిచేశామని తెలిపారు. తమ అనుభవాల వల్ల భవిష్యత్‌లో మెట్రో ప్రాజెక్టులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మెట్రో రైల్‌ మొదటి దశ నిర్మాణంలో ఎదురైన సవాళ్లను, సమస్యలను వివరించి అదేవిధమైన సమస్యలు తదుపరి మెట్రో నిర్మాణ దశల్లో ఎదురైతే అధిగమించేందుకు అందుబాటులో ఉన్న పరిష్కారాలను కూడా తన ప్రజెంటేషన్‌లో పేర్కొ న్నారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ పలు ఆదేశాలను జారీ చేశారు. జీఎంఆర్‌ ఆధ్వర్యంలోని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ వర్గాలు, వెంటనే 48 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో కోసం కేటాయించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన భూమిని వెంటనే అందించాలన్నారు. మెట్రో విస్తరణ ప్రణాళికలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని మంత్రి కేటీఆర్‌ కోరారు. లక్డికాపూల్‌ నుంచి బీహెచ్‌ఇఎల్‌, ఎల్బీనగర్‌ నుంచి నాగోల్‌ వరకు విస్తరించాలనుకుంటున్న మార్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.9100 కోట్ల అంచనా వ్యయంలో కొంత ఆర్థిక సాయాన్నిఇప్పటికే అడిగామని, దీనికి సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తాజాగా మెట్రోలైన్‌ని భారీగా విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆయా మార్గాల్లో వెంటనే అవసరమైన సర్వేలను చేపట్టి ప్రాథమిక రిపోర్టులను, తర్వాత డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌లను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మెట్రో విస్తరణ కోసం అవసరమైన నిధుల సేకరణకు ఉన్న అవకాశాలను వేగంగా పరిశీలించాలని ఈ సంద ర్భంగా ఆర్థిక, పురపాలక శాఖ అధికారులకు ఆయన సూచించారు. స్టేషన్ల తో పాటు కారు పార్కింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖాళీ జాగాలను గుర్తించాలని హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి, జిల్లాల కలెక్టరను కేటీఆర్‌ ఆదేశించారు. అనంతరం ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. పాతబస్తీ మెట్రో కారిడార్‌ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భూ సేకరణ ప్రక్రియను చేపట్టామని, త్వరలోనే కారిడార్‌ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కేటీఆర్‌ తెలిపారు. మహాత్మా గాంధీ బస్‌ స్టేషన్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న ప్రస్తుత ఎయిర్‌పోర్ట్‌ మెట్రో కారిడార్‌ను శంషాబాద్‌ విమానాశ్రయం వరకు పొడిగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

Spread the love