మణిపుర్‌లో మరోసారి రెచ్చిపోయిన మిలిటెంట్లు..

నవతెలంగాణ – హైదరాబాద్: జాతుల మధ్య వైరంతో గతేడాది అట్టుడుకిపోయిన ఈశాన్యం రాష్ట్రం మణిపుర్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. బిష్ణూపుర్‌ జిల్లాలో భద్రతా సిబ్బంది క్యాంప్‌పై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌  సిబ్బంది అమరులయ్యారు. లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో భాగంగా అవుటర్‌ మణిపుర్‌ స్థానానికి శుక్రవారం పోలింగ్‌ జరిగింది. నరన్‌సైనా ప్రాంతంలో ఓటింగ్‌ విధుల్లో పాల్గొన్న సీఆర్పీఎఫ్‌ సిబ్బంది నిన్న రాత్రి ఇక్కడి ఇండియా రిజర్వ్‌ బెటాలియన్‌ క్యాంప్‌ వద్ద బస చేశారు. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత వీరిపై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని కొండల ప్రాంతం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత మొదలైన కాల్పులు దాదాపు 2.30 గంటల వరకు సాగాయి. క్యాంప్‌పైకి మిలిటెంట్లు బాంబులు కూడా విసిరారు. అప్రమత్తమైన సీఆర్పీఎఫ్‌ బలగాలు మిలిటెంట్లపై ఎదురుకాల్పులు జరపడంతో వారు పరారయ్యారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌. సర్కార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ అరూప్‌ సైనీ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

Spread the love