అస్ట్రేలియాలో ఎన్నారై హత్య.. ఇద్దరు భారతీయలు అరెస్టు!

నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియాలో హర్యానా విద్యార్థి నవ్‌జీత్ సంధూ హత్య కేసులో ఇద్దరు భారత విద్యార్థులను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. విక్టోరియా పోలీస్ హోమిసైడ్ డిటెక్టివ్‌లు మంగళవారం పరారీలో ఉన్న నిందితులు అభిజిత్ (26), రాబిన్ గార్టాన్ (27)ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు, నిందితులు హర్యానాలోని కర్నాల్‌ జిల్లాకు చెందిన వారని తెలిసింది. ఆదివారం మెల్బోర్న్‌లోని ఓర్మాండ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ హత్య జరిగింది. ఆ రాత్రి సంధూను నిందితులు ఛాతిలో పొడిచి చంపేశారు. ఇంటి రెంటు విషయంలో కొందరు విద్యార్థుల మధ్య గొడవ జరుగుతుండగా సంధూ మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే హత్య జరిగిందని మృతుడి బంధువు తెలిపాడు. కాగా, నిందితులిద్దరూ అన్నదమ్ములని తెలిసింది. ఇక మెల్బోర్న్‌లో ఎంటెక్ చదువుతున్న సంధూ 2022 నవంబర్‌లో ఆస్ట్రేలియా వెళ్లాడు. సంధూది సామాన్య రైతు కుటుంబం. తల్లిదండ్రులకు అతడొక్కడే కొడుకు. కుమారుడి మరణంతో కష్టాల్లోపడ్డ తల్లిదండ్రులను ఆదుకునేందుకు ఆన్‌లైన్‌లో గోఫండ్ మీ పేజ్ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించారు. ‘‘నవ్‌జీత్ సింగ్ సంధూ తెలివైన విద్యార్థి. అతడు ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాడు. ఓ వివాదంలో మధ్యవర్తిత్వం నెరపే క్రమంలో దురదృష్టవశాత్తూ కన్నుమూశాడు. తన కుటుంబ భవిష్యత్తు కోసం అతడు స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చాడు. అతడి తల్లిదండ్రులకు సంధూ ఒక్కడే కొడుకు. అతడికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు’’ అని సంధూ గోఫండ్‌మీ పేజ్‌లో పేర్కొన్నారు.

Spread the love