ఉన్న మాటంటే ఉలుకెందుకు: మంత్రి హరీష్‌ రావ్‌

నవతెలంగాణ – సిద్దిపేట: జిల్లా బీఆర్ యస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ రావ్‌ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరోసారి ఏపీ మంత్రులపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఉన్నమాటంటే ఉలుకెందుకు అని అన్నారు. నేను ఆంద్రప్రదేశ్ ప్రజల్ని తిట్టింది లేదు ఏం చేసింది లేదన్నారు. అయినా కొంత మంది నాయకులు ఎగేరిగిరి పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఏపీ ప్రజల పక్షాన మాట్లాడిన అని అన్నారు. మీకు చేతనైతే ఏపీకి జాతీయ హోదా కోసం పోరాడండి అంటూ హరీశ్‌ రావు అన్నారు. విశాఖ ఉక్కు కోసం పోరాడండి అన్నారు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి మా కాళేశ్వరం లాగా నీళ్లు అందించి మాట్లాడండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అన్నారు. మా తెలంగాణ ఎంత గొప్పగా ఉందొ పక్క రాష్ట్రాలతో పోల్చి చెప్పానని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి. ఏపీ మంత్రులు కౌంటర్‌ ఎటాక్‌కు దిగుతున్న నేపథ్యంలో వారి వ్యాఖ్యలపై మరోసారి అదేస్థాయిలో మంత్రి హరీష్‌రావు స్పందించారు. ఇక తాజాగా మంత్రి హరీశ్‌ రావు సంగారెడ్డి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందని సవాల్‌ చేశారు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది.. బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉంది.. కేసీఆర్‌ కిట్ ఉంది. కళ్యాణ లక్ష్మి ఉంది.. ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉంది అంటూ రాష్ట్రంలో అమలు చేస్తోన్న పథకాల గురించి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. ఏపీలోని రాజకీయ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్‌రావు..ప్రత్యేక హోదా కేంద్రం ఎగబెట్టినా ఏమీ అడగరు.. ఏపీ లో ఏముంది..? అని ప్రశ్నించారు హరీష్‌రావు.. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరూ మాట్లాడటం లేదన్న ఆయన.. విశాఖ ఉక్కును తుక్కు కింద పెట్టినా మాట్లాడని పరిస్థితి ఉందన్నారు..
అధికార పార్టీ అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదని కౌంటర్‌ ఇచ్చారు.. రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పని చేస్తున్నాయని ఆరోపించారు. అయితే, అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకండి.. అది మీకే మంచిదని ఆంధ్ర మంత్రులకు సూచించారు.. ఇక, ఢిల్లీలో ఉన్నోళ్లు మనల్ని నూకలు బుక్కమని ఎగతాళి చేశారు.. తెలంగాణ ప్రజలంతా కలిసి ఢిల్లీలో ఉన్నోడికి నూకలు బుక్కీయ్యాలి అని పిలుపునిచ్చారు మంత్రి హరీష్‌రావు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులు అక్కడ ఓటు హక్కును రద్దు చేసుకుని తెలంగాణలో పొందాలని హరీష్‌రావు సూచించారు.. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలే అని పేర్కొన్న ఆయన ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వారంతా తెలంగాణలోనే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.. ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసిన మీరు అక్కడ రోడ్లు, ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందో చూసే ఉంటారని వ్యాఖ్యలు చేశారు.

Spread the love