ఆ పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో 300 మందికిపైగా పాకిస్థానీలే!

నవతెలంగాణ – ఢిల్లీ
దాదాపు 700 మంది వలసదారులతో వెళ్తూ మధ్యధరా సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో 300 మందికిపైగా పాకిస్థానీలే ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. అంతేకాదు, ప్రమాదానికి గురైన బోటులో 200 మందికిపైగా చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. లిబియా నుంచి వలసదారులతో బయలుదేరిన ఈ పడవ బుధవారం బోల్తాపడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 79 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. 12 మంది పాకిస్థానీలు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో వందలాదిమంది గల్లంతు కాగా, వారిలో 300 మందికిపైగా పాకిస్థానీలు ఉన్నట్టు తేలింది. ఈ ప్రమాదంలో 298 మంది చిన్నారులు అదృశ్యమైనట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ప్రమాదంపై పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆచూకీ గల్లంతైన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాకిస్థాన్ జాతీయుల అక్రమ రవాణాకు కారకుడిగా భావిస్తున్న వ్యక్తిని కరాచీ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అజర్‌బైజన్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Spread the love