పలాసలో అర్ధరాత్రి హైడ్రామా…

నవతెలంగాణ – పలాస
పలాస పట్టణంలో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. అక్రమణ నిర్మాణాల కూల్చివేత పేరిట టీడీపీ నేతలపై వేధింపులకు దిగుతున్నారంటూ ఆందోళనకు దిగిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాస పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు తన ఇంటికి వెళ్లే దారిలో ఉన్న సాగునీటి కాలువపై పదిహేనేళ్ల క్రితం కల్వర్టు నిర్మించుకున్నారు. అయితే, ఈ కల్వర్టు నిర్మాణం అక్రమమంటూ ఇటీవల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిందంటూ కల్వర్టు తొలగించేందుకు సిద్ధమయ్యారు. శనివారం అర్ధరాత్రి కూల్చివేత సామాగ్రితో కల్వర్టు వద్దకు చేరుకున్నారు. దీంతో, అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తవాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుడు నాగరాజును ఇబ్బంది పెట్టడానికే కల్వర్టు కూల్చేందుకు రెడీ అయ్యారని టీడీపీ నేతలు ఆరోపించారు. నాగరాజుకు మద్దతుగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటూ పలువురు టీడీపీ నాయకులు ఘటనాస్థలంలో ఆందోళన చేపట్టారు. దీంతో, పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. అధికారులు, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, మంత్రి సిదిరి అప్పలరాజు ఆదేశాలతోనే అధికారులు తన ఇంటికి దారి లేకుండా చేస్తున్నారని టీడీపీ నేత నాగరాజు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాననే కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని నాగరాజు ఆరోపించారు.

Spread the love