వివేకా హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరిపై కేసు

నవతెలంగాణ – హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరిపై పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. పట్టణంలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో జయమ్మ కాలనీలో ఉంటున్న దస్తగిరి తన నివాసంలో అదే వీధికి చెందిన తన కుమారుడు గూగుడువల్లీని నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, అతడిని కాపాడాలంటూ అతని తల్లి కుళ్లాయమ్మ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎస్‌.ఐ. హుస్సేన్‌ తన సిబ్బందితో కలిసి దస్తగిరి ఇంట్లో నిర్బంధించిన ఆ బాలుడిని విడిపించారు. తన వెంట తీసుకొచ్చి పులివెందులలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్య సేవలందించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు, వైకాపా నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యసేవల అనంతరం బాలుడిని స్టేషన్‌కు తీసుకెళ్తుండగా పోలీసుల వాహనాన్ని బాధితుడి బంధువులు అడ్డుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బాధితుడి తల్లి కుళ్లాయమ్మ మాట్లాడుతూ.. ‘కుటుంబ అవసరాల నిమిత్తం తన భర్త పెద్దగూగుడువల్లీ, తాను కలిసి ఆరు నెలల కిందట దస్తగిరి వద్ద వడ్డీకి రూ.40 వేలు అప్పు తీసుకున్నాం. వారం వారం వడ్డీ చెల్లిస్తూ వస్తున్నాం. పది రోజుల నుంచి డబ్బులు సక్రమంగా కట్టకపోవడంతో మా కుమారుడు గూగుడువల్లీని సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దస్తగిరి తన వెంట తీసుకెళ్లి అతని ఇంట్లోనే నిర్బంధించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మా అంతు చూస్తానని బెదిరించాడు….’ అని వివరించారు. బాలుడు గూగుడువల్లీ మాట్లాడుతూ తనను ఇంట్లోనే నిర్బంధించి హింసించాడని పోలీసులకు వివరించాడు. బాలుడి తల్లి కుళ్లాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై హుస్సేన్‌ వెల్లడించారు. ఈ క్రమంలో దస్తగిరిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. తమపై అన్యాయంగా ఫిర్యాదు చేశారని దస్తగిరి, అతడి కుటుంబసభ్యులు ఆరోపించారు.

Spread the love