బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు

బీజేపీ రాజకీయాలతో భారత్‌కు చేటు
– మోడీ పాలనలో తిరోగమన పరిస్థితులు
– పలు రంగాలను భ్రష్టు పట్టిస్తున్న కాషాయ పార్టీ
– రాజకీయ విశ్లేషకులు, నిపుణుల ఆందోళన

న్యూఢిల్లీ : ఢిల్లీలోని అత్యంత భద్రతతో కూడిన తీహార్‌ జైలులో టిల్లు తాజ్‌పురియా అనే వ్యక్తి హత్యకు సంబంధించిన వార్తలను వారం రోజులుగా హిందీ వార్తాపత్రికలు వరుసగా అందించాయి. హతుడిని 50 సార్లు పొడిచిన విధానాన్ని వివరించాయి. జైలులో ఇంత ఘోరం జరిగినా పోలీసులు మాత్రం అడ్డుకోలేకపోయారు. తీహార్‌ జైలులో ముఠాలు, ముఠా నాయకుల ఉనికి గతంలో దేశంలో నెలకొని ఉన్న కఠినమైన రోజులను గుర్తు తెస్తున్నది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత, శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గత కొన్నేండ్లుగా ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయన్నారు. వ్యాపారం, రాజకీయం, క్రీడలు, బ్యూరోక్రసీ, వినోదం, సాహిత్య ప్రపంచం.. ఇలా రంగమేదైనా బీజేపీ నాయకుల రంగప్రవేశంతో అవి కలుషితమవుతున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.
బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ వ్యవహారం
బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై మహిళా అథ్లెట్ల లైంగిక ఆరో పణలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇది దేశం దృష్టిని ఆకర్షించింది. న్యూఢిల్లీలోని జంతరమంతర్‌ వద్ద జరుపుపుతున్న మహిళా అథ్లెట్ల నిరసనలకు అన్ని రంగాల నుంచి మద్దతు లభించింది. బ్రిజ్‌ భూషణ్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌ పెరిగింది. అయితే, బ్రిజ్‌ భూషణ్‌ తాను రాజీనామా చేసేది లేదని తెలి పాడు. దేశరాజధానిలోనే ఇంత తతంగం జరుగుతున్నా.. కేంద్రంలోని మోడీ సర్కారుకు కానీ, బీజేపీ పార్టీ పెద్దలకు గానీ ఇదేదీ కనిపించకపోవడం గమనార్హం. ఇలాంటి తరుణంలో నెటిజన్లు మోడీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మణిపూర్‌ హింసాత్మకం
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అట్టుడికిపోతున్నది. గిరిజన, గిరిజనేతరుల మధ్య జరిగిన ఘర్షణలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర హింసకు దారి తీశాయి. 50 కంటే ఎక్కువ మంది వ్యక్తుల మరణానికి దారి తీశాయి. వందలాది మంది గాయాల పాలయ్యారు. ”జాతీయ ప్రతిష్ట” దెబ్బ తిన్నది. భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ గొడవలను నివారించడంలోనూ, అదుపు చేయటంలోనూ విఫలమైంది. సాక్షాత్తూ బీజేపీ పార్టీ కింది స్థాయి కార్యకర్తలే బీజేపీ బలహీన తీరును విమర్శించారు. మణి పూర్‌లో ఇంత గొడవ జరుగుతున్నా.. ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాలు మాత్రం ఇవేమీ పట్టనట్టుగా ఎన్నికల్లో లబ్ది పొందటమే లక్ష్యంగా కర్నాటక ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. మోడీ సర్కారు తీరుపై రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
కర్నాటకలో 40 శాతం కమీషన్‌ వ్యవహారం
కర్నాటకలో బీజేపీ ”డబుల్‌-ఇంజిన్‌” సర్కారు పట్ల ప్రజలు విసుగు చెందారు. ముఖ్యంగా, అక్కడ 40 శాతం కమీషన్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ కోపాన్ని కన్నడ ఓటరు ఓటుతో తీర్చుకున్నాడు. ఈ విషయాన్ని ఈనెల 10న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం అనేక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలే స్పష్టం చేశాయి. దాదాపు అన్ని సర్వేల్లో కాంగ్రెస్‌ అతి పెద్ద పార్టీగా అవతరిండం గమనార్హం. దీంతో కన్నడిగులు మళ్లీ బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టడానికి ఇష్టంతో లేరనేది స్పష్టమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు అంటున్నారు. మోడీ, షా, యోగి త్రయం ప్రచారం చేసినా ఓటర్లను అనుకున్నంత ప్రభావితం చేయలేకపోయారని తెలుస్తోంది..
ఆరెస్సెస్‌ కార్యకలాపాలు
ఇటు బీజేపీ మాతృ సంస్థగా చెప్పబడే ఆరెస్సెస్‌ తన అనుబంధ సంస్థ లతో హింసకు పాల్పడుతున్నదని విశ్లేషలు వెలువడుతున్నాయి. నాగ్‌పూర్‌ కేంద్రంగా అనేక కుట్రలు తెరలేపుతున్నదని చెప్పారు. బజరంగ్‌దళ్‌ వంటి హిందూత్వ సంస్థలను అల్లర్లకు ఎగదోస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సంస్థల కారణంగానే కర్నాటకలో హిజాబ్‌ వివాదం చెలరేగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.. అలాగే, తన విద్యార్థి విభాగంతో ఢిల్లీ, జేఎన్‌యూ వంటి యూనివర్సిటీల్లో గొడవలకు కారణమైందన్నారు.

Spread the love