జనవరి 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠాపన

నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్య భవ్య రామ మందిరంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన జరగనుంది. ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను 4 దశల్లో చేపట్టనుండగా మొదటి దశలో స్టీరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాణ ప్రతిష్ఠాపనకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ కమిటీల ద్వారా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇక రెండో దశలో 10 కోట్ల కుటుంబాలకు రాముడి చిత్రపటం, కరపత్రాన్ని అందించాలని నిర్వహకులు నిర్ణయించారు. మూడో దశలో భాగంగా వచ్చే జనవరి 22న దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉత్సహాలు నిర్వహించనున్నారు. జనవరి 26న మొదలు కానున్న నాలుగో దశలో భక్తులకు రామయ్య దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు.
అర్చక పోస్టులకు భారీగా దరఖాస్తులు
అయోధ్య రామ మందిరంలో అర్చక పోస్టులకు భారీ స్పందన కనిపిస్తోంది.  దాదాపు 3 వేల దరఖాస్తు రాగా ఇందులో 200 మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. చివరిగా 20 మందిని ఎంపిక చేయనున్నట్లు ట్రస్టు ప్రతినిధులు వివరించారు. ఇదిలావుండగా 14వ అయోధ్య నగర ప్రదక్షిణ కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. నవంబర్ 21(మంగళవారం) తెల్లవారుజామున 2 గంటలకు ప్రదక్షిణ మొదలై రాత్రి 11.38 గంటలకు ముగియనుందని నిర్వాహకులు తెలిపారు.

Spread the love