పాట్నా : బీహార్లో కులాల వారీగా వివరాలు సేకరించడానికి పాట్నా హైకోర్టు గ్రీన్సిగల్ ఇచ్చింది. బీహార్ ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి ఏడవ తేదీన తొలి దశ కులగణన సర్వే చేపట్టింది. అయితే రెండవ దశ సర్వే కొనసాగుతుండగా ఈ ప్రక్రియపై హైకోర్టు మేలో తాత్కాలిక స్టే విధించింది. కులాల సర్వేను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి కె.వినోద్ చంద్రన్, న్యాయమూర్తి పార్థసారధితో కూడిన ధర్మాసనం మంగళవారం తోసిపుచ్చడంతో కులగణనకు అడ్డంకులు తొలగిపోయాయి. పాట్నా హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా దానిలో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం అప్పట్లో నిరాకరించింది.