నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఖమ్మం జల్లా తెల్దార్పల్లికి చెందిన పీఎన్ఎమ్ సీనియర్ నాయకుడు వేగినాటి వెంకటేశ్వర్లు మృతికి ప్రజానాట్యమండలి సంతాపం తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ మేరకు పీఎన్ఎమ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వేముల ఆనంద్, కట్ట నర్సింహ ఒక ప్రకటన విడుదల చేశా రు.ప్రజా ఉద్యమాల్లో, కళారంగంలో వేగినాటి కృషి మరువలేనిదని పేర్కొన్నారు. రాజకీయ వ్యంగ్య నాటకాలను ప్రదర్శించడంలో ఆయన దిట్ట అని కొనియాడారు. ప్రజానాట్యమండలి ఖమ్మం జిల్లా నిర్మాణంలో వేగినాటి కృషి విస్మరించలేనిదని పేర్కొన్నారు. ఆయన మృతి ప్రజానాట్యమండలికి తీరని లోటు అని తెలిపారు.
రాకేశ్మాష్టార్ మృతి బాధాకరం : పీఎన్ఎమ్
రాకేశ్ మాస్టర్ మృతి బాధాకరమని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వేముల ఆనంద్, కట్ట నర్సింహ పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. మంచి కొరియోగ్రాఫర్, అభ్యుదయవాది, హేతువాదిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాకేశ్మాస్టర్ 1500కిపైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశారనీ, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, ఇలా అనేక మంది డ్యాన్స్ మాష్టార్లకు గురువుగా వ్యవహరించారని గుర్తుచేశారు. తనకు అన్ని మతాలూ సమానమేనీ, మనుషులందరూ ఒక్కటేనని చాటేలా తన ఒంటిపై హిందూ, క్రిస్టియన్, ముస్లిం, తదితర మతాల చెందిన ప్రతిమలను పచ్చబొట్లుగా పొడిపించుకున్నారని తెలిపారు. అందరితోనూ కలివిడిగా ఉండే రాకేశ్ మాస్టర్ అనారోగ్యంతో మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు.