మతోన్మాద శక్తులకు సవాల్‌ విసిరిన ప్రబీర్‌…

– వామ పక్షాలు, అభ్యుదయ, ప్రగతి శీల శక్తులే లక్ష్యంగా అక్రమ అరెస్టులు
– అక్రమ కేసులను ఈడీ, ఐటీ, సీబీఐల ద్వారా మోపుతున్న బీజేపీ
– అలుపెరుగని పోరాట యోధుడు పుస్తకావిష్కరణ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
మతోన్మాద శక్తులకు సవాల్‌ విసిరిన ప్రబీర్‌…అలుపెరగని పోరాటమని, దేశంలో వామ పక్షాలు, అభ్యుదయ, ప్రగతి శీల శక్తులే లక్ష్యంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులను ఈడీ, ఐటీ, సీబీఐల ద్వారా మోపుతుందని ప్రబీర్‌ పుర్కాయస్థ రచించిన ”అలుపెరుగని పోరాట యోధుడు…” పుస్తకావిష్కరణ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ(ఎం) కార్యాలయంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అధ్యక్షతన నిర్వహించిన సభలో కూనంనేని పుస్తకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో పెట్టిన ఎమర్జెన్సీ నుండి నేటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రకటీత ఎమర్జెన్సీ వరకు ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులను అలుపెరగని పోరాటం..ఈ బుక్‌లో రచయిత ప్రబీర్‌ పుర్కాయస్థ వివరించారన్నారు. తన యాభై ఏళ్ల వ్యవధిలో రెండు నిరంకుశ ప్రభుత్వాల చేత ప్రబీర్‌ వేధింపులకు గురయ్యారన్నారు. వృత్తి రీత్యా సాంకేతిక నిపుణులుగా, సైన్స్‌ కార్యకర్తగా పని చేస్తూ రాజకీయాలను అనుసంధానం చేశారని తెలిపారు. భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన సమయంలో లీకేజీ కారణాలను వెలికితీసి బాధితల తరపున పోరాటం చేసిన నిపుణులలో ఒకరని గుర్తుచేశారు. దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్య, లౌకిక పరి రక్షణకి దోహద పడతయన్నారు. పుస్తక అనువాదకులు బోడపట్ల రవీందర్‌ మాట్లాడుతూ సాఫ్ట్‌ వ్వేర్‌ రంగంలో, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని నేటి మీడియా తీరు తెన్నులలో వచ్చిన మార్పులను, ప్రింట్‌ మీడియాకి ఒకప్పుడు ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు లేదని గుర్తించిన ప్రబీర్‌ న్యూస్‌ క్లిక్‌ పేరుతో ఒక ఆన్‌ లైన్‌ వార్త సంస్థని స్ట్టాపించారని చెప్పారు. మహారాష్ట్రలో జరిగిన రైతాంగ లాంగ్‌ మార్చ్‌ సమయంలోనూ, డిల్లీ నగరంలో ఏడాదికి పైగా కొనసాగిన రైతాంగ ముట్టడిలోనూ ఒక వార్త సంస్థగా న్యూస్‌ క్లిక్‌ మంచి పాత్ర పోషించిందన్నారు. మోడీ ప్రభుత్వానికి ఇది కంటగింపుగా తయారై 2021 లోనే ఎన్ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరెట్‌ న్యూస్‌ క్లిక్‌ కార్యాలయంపైన, ప్రబీర్‌ నివాసంపైన దాడి చేసి, సోదా నిర్వహించిందని తెలిపారు. అక్రమంగా అరెస్ట్‌ చేసి, కేసులు నమోదు చేసి, 18 నెలలుగా తీహార్‌ జైలులో నిర్బంధించారని తెలిపారు. ప్రబీర్‌కి సంఘీభావంగా మనం అంత నిలబడాలన్నారు.
సీపిఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి, సీపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా, సీపిఐ ఎంఎల్‌ చంద్రన్న వర్గం జిల్లా నాయకులు సురేందర్‌, ఐలూ జిల్లా కార్యదర్శి రమేష్‌ కుమార్‌ మక్కడ్‌లు మాట్లాడుతూ ప్రబీర్‌ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పని చేయాలని, మోడీ మూడవసారి ప్రధాని అయితే ఇప్పుడు కొనసాగుతున్న నిర్బంధం మరింత ఉదృత్యం అవుతుందని హెచ్చరించారు. రాజ్యాంగ మూల స్తంభాలుగా ఉన్న ప్రజాస్వామ్యం, లౌకిక, సామాజిక న్యాయం, సమాఖ్య వ్యవస్థలకు ఉనికి లేకుండా పొతుందని, ఒకే మతం, ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం అమలులో అలుపే లేకుండా పని చేస్తారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పని చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు ప్రబీర్‌ పుర్కాయస్థ రాసిన అలుపెరుగని పోరాటం పుస్తకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ బుక్‌ హౌస్‌ ఎడిటర్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె.రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు ఆన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్‌, నబీ, దొడ్డ రవికుమార్‌, భూక్యా రమేష్‌, వీర్ల రమేష్‌, రచయితలు, కవులు మండవ సుబ్బారావు, సిరం శెట్టి కాంతరావు, రాజేందర్‌, పుల్లయ్య, చార్వాక, రాజశేఖర్‌, పార్టీ నాయకులు యూ.నాగేశ్వర్‌ రావు, డీ.వీరన్న, కృష్ణ, సత్య, వాణి దితరులు పాల్గొన్నారు.

Spread the love