ఆ డబ్బుల్ని బీఆర్ఎస్ నేతలు నొక్కేశారు : ప్రధాని మోడీ

నవతెలంగాణ-హైదరాబాద్ : మోడీ గ్యారంటీ అంటే దేశ భద్రత, సామాజిక భద్రతకు, అభివృద్ధికి గ్యారంటీ అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మోడీ గ్యారంటీ అంటే ప్రపంచంలో భారత్ గౌరవం పెంపొందించేందుకు, మూడు కోట్ల పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ఇస్తున్న గ్యారంటీ మోడీ గ్యారంటీ అని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్ లో ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. తన పదేళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని దేశంతో పాటు తెలంగాణ కూడా అభివృద్ది చెందాలని కొన్ని లక్షల కోట్ల రూపాయలను నిధులుగా ఇచ్చామని ప్రధాని తెలిపారు. అయితే పాలకుల అవినీతి వల్ల ఆ డబ్బుల్ని బీఆర్ఎస్ నేతలు నొక్కేశారని ప్రధాని మోడీ మండిపడ్డారు. అనేక హామీలిచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అయితే ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో మార్పుకోసం బీఆర్ ఎస్ ను గద్దె దించి కాంగ్రెస్ కు పట్టం కట్టారని అయితే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ ఎస్ కు జిరాక్స్ కాపీలా ఉందని ఎద్దేవా చేశారు.

Spread the love