కేసీఆర్‌ పక్కన శకునిలా సోమేశ్‌కుమార్‌

– కేసీఆర్‌ హర్‌ ఘర్‌ మద్యం అంటున్నడు :బూర నర్సయ్యగౌడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ పక్కనున్న సోమేశ్‌కుమార్‌ శకునిలా తయారయ్యాడని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ విమర్శించారు. బీజేపీ హర్‌ఘర్‌ తిరంగ అంటుంటే..కేసీఆర్‌ మాత్రం హర్‌ ఘర్‌ మద్యం అంటున్నాడన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 30 వేల మద్యం దుకాణాలు, పదివేలకుపైగా పబ్బులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, 60 వేలకుపైగా బెల్టు షాపులు నడుస్తున్నాయన్నారు. బెల్టుషాపులను తొలగించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చొద్దని కోరారు. గౌడ్‌లకు, ఎస్టీలకు, ఎస్సీలకు రిజర్వేషన్లు పెట్టి మద్యం దుకాణాల టెండర్‌ దరఖాస్తును రెండు లక్షల రూపాయల నాన్‌ రీఫండ్‌ పెట్టారన్నారు. ఆర్థికంగా వెనుకబడినవారు అంత ఫీజు పెట్టి టెండర్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. దేశంలో అత్యధికంగా మద్యం రేట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణేనని విమర్శించారు. రాయల్‌ స్టాగ్‌ ఫుల్‌ బాటిల్‌ మన రాష్ట్రంలో రూ.880 ఉందనీ, అదే యూపీలో రూ.560 మాత్రమే ఉందని చెప్పారు. గౌడ్‌లకు రిజర్వేషన్‌ చేసిన మద్యం దుకాణాలను గీత కార్మికుల సొసైటీలకివ్వాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీలకు రిజర్వ్‌ చేసిన మద్యం దుకాణాలకు టెండర్‌ వేయడానికి రూ. 25 వేల ఫీజు పెట్టాలని సూచించారు. ఎలైట్‌ షాప్‌లను కేవలం కేసీఆర్‌ బినామీలే తీసుకుంటున్నారని ఆరోపించారు.

Spread the love