– టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు
– నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ మినీ గురుకుల బాలికల పాఠశాలల కాంట్రాక్టు బోధన, బోధనేతర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు డిమాండ్ చేశారు. త్రిపురారం, పెద్దవూర, చందంపేటలోగల మూడు మినీ గురుకుల బాలికల పాఠశాలల్లో కాంట్రాక్టు బోధన, బోధనేతర ఉద్యోగులు 24 ఏండ్ల నుంచి పనిచేస్తున్నారని చెప్పారు. వారి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గురువారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మినీ గురుకుల ఉద్యోగుల సంఘం నాయకులు జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి మోతిలాల్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మినీ గురుకుల ఉపాధ్యాయులు విమల, స్వర్ణలత, ఝాన్సీ సరోజ, శ్వేత, శైలజ, రోజా కుమారి, లక్ష్మి, అనూష, కవిత, ఉమాదేవి, నీలా తదితరులు పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులపై ఖండన
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేజీబీవీ, యుఆర్ఎస్ ఉద్యోగులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ వెంకటేశం ఒక ప్రకటనలో ఖండించారు. మినిమం బేసిక్ పే, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, కేర్ టేకర్, ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు, నగదు రహిత వైద్యం, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.