మొరాకోలో తీవ్ర భూకంపం

Strong earthquake in Morocco– 1037 మంది మృతి
,రాబట్‌ : భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న మర్రాకేచ్‌ నగరంలో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. రెస్టారెంట్ల నుండి పర్యాటకులను ఖాళీ చేయించారు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయ్యాయి. నగరంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం, కొన్ని ఇతర భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. మృతదేహాలు, కుప్పకూలిన భవనాల శిథిలాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడిపోవడంతో భయానక వాతావరణం కన్పిస్తోంది. కొన్ని భవంతులు కూలకపోయినా వాటికి భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి.
వివిధ ప్రాంతాలలో మహిళలు, చిన్నారులు సహా ప్రజలు రాత్రంతా రోడ్ల పైనే బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో కాలక్షేపం చేశారు. కొన్ని చోట్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ మరిన్ని ప్రకంపనలు సంభవిస్తాయేమోనన్న అనుమానంతో ప్రజలు తిరిగి తమ నివాసాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఇప్పటి వరకూ ఇలాంటి భారీ భూకంపం సంభవించలేదని స్థానిక మీడియా తెలిపింది. ‘భూమి కంపిస్తోన్న సమయంలో నిద్రలో ఉన్నాం. గాల్లోకి ఎగిరిపోతున్నట్టు మాకు అనిపించింది. దాంతో వెంటనే ఇంట్లో నుంచి బయటకుపరిగెత్తాము. మా ప్రాంతమంతా ఏడుపులు, కేకలతో నిండిపోయింది’ అని మర్రాకేశ్‌ స్థానికులు వాపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారితో సమీప ఆస్పత్రులు కిక్కిరిసి పోయాయి. ఈ ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న అల్జీరియాలోనూ కనిపించింది. అయితే, అక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. 1980లో అల్జీరియాలో 7.3 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించింది. ఆ దుర్ఘటనలో 2500 మంది మరణించగా.. 3 లక్షల మంది నిరాశ్రయలుగా మారారు. ఈ ఏడాది తుర్కియే సైతం ప్రకృతి ప్రకోపానికి గురైన సంగతి తెలిసిందే. దాంతో వేలల్లో మరణాలు సంభవించాయి.
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..
మొరాకోలో భూకంపంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ భూకంపం వల్ల వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకో ప్రభుత్వంతో కలిసిపనిచేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. మొరాకోకు సమష్టిగా సాయం చేయాలని జీ20 ప్రారంభోపన్యాసంలో కూడా మోడీ పిలుపునిచ్చారు.

Spread the love