పల్లెతనపు పచ్చికలో సేదతీర్చే ‘ఇల్లింతపండ్లు’

మనిషి మనిషికి తను పొందిన అనుభూతులు, తను చూసిన నేపథ్యం వల్ల కలిగే అనుభవాలు భిన్నంగా ఉంటాయి. కానీ తన అనుభూతులను పాఠకుడి ఊహానేత్రంలో తన అక్షర బలంతో, తను చెప్పే తీరులోనే ప్రత్యక్షం అయ్యేలా చేస్తే ఆ కథారచయితలు చెప్పడంలో సఫలీకృతమయినట్లే. అటువంటి కథలే హుమాయున్‌ సంఘీర్‌ చెప్పిన ‘ఇల్లింత పండ్లు’. ఈ కథాసంపుటిలో పద్నాలుగు కథలున్నాయి. కానీ ‘ఇల్లింత పండ్లు’ శీర్షికతో ఏ కథా లేదు. సాధారణంగా కథాపుస్తక శీర్షిక ఎప్పుడు ఆ కథల్లోని ఒక పేరుగా ఉంటుంది. కానీ ఈ పుస్తక శీర్షిక అందుకు భిన్నం. అరుదుగా దొరికే అడవి పళ్ళు ఇల్లింత పండ్లు. ఎక్కడా విక్రయించని ఈ పళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. తియ్యగా, పులుపుగా, వగరుగా ఉండే ఈ పళ్ళు అందించే ఈ భిన్న రుచుల సంగమంలానే ఈ కథలు కూడా రకరకాల అనుభూతులు పాఠకుల్లో కలిగిస్తాయని రచయిత ముందుమాటలో పేర్కొన్నారు. ప్రకృతితో, పల్లెతో మమేకమై అనేక దృశ్యాలను పాఠకుల కళ్ళకు కట్టేలా చేసే ఆ కథల భిన్నతను సూచించేదే ఈ పుస్తక శీర్షిక.
వివాహం తరువాత భార్యాభర్తలు ఒకరిపై మరొకరు చూపించే ప్రేమ. తన కంటే తన భాగస్వామికే ప్రాధాన్యత ఇవ్వడం. ‘ఐడియలైజ్‌’ వాతావరణంలో స్పేస్‌ లేని మానసిక ఆవరణ గురించి చర్చించే కథే ‘ప్రేమ’. ప్రపంచవ్యాప్తంగా నేడు అనేక మానసిక సమస్యలకు కారణం ‘సెల్ఫ్‌ లవ్‌’ లేకపోవడమే అని ‘హీల్‌ యువర్‌ సెల్ఫ్‌’ (నవaశ్రీ yశీబతీరవశ్రీట) పుస్తకంతో ప్రసిద్ధి చెందిన లూయిస్‌ హే స్పష్టం చేశారు.
‘అనైతికం’. సాధారణంగా నైతికత అంటే వ్యక్తి విలువలతో ముడిపడిన అంశంగా భావించే నేపథ్యంలో, దానికి భిన్నంగా మనిషి తోటి మనిషిని మనిషిగా చూడలేని తారతమ్యాలను తమ మనసుల్లో నిర్మించుకుని మనిషికి మనిషికి మధ్య అసమానత్వ గోడలు నిర్మించే సంస్కృతే ‘అనైతికం’ అని ఈ కథలో రచయిత స్పష్టం చేస్తారు. ముఖ్యంగా ఈ కథాసంపుటిలోని అనేక కథల్లో పల్లె వాసనలు, ఆ పల్లెను విడిచి వచ్చి పట్టణాల్లో ఉండేవారిని వేటాడే ఆ మధుర స్మృతులు, జ్ఞాపకాలు ఒక భాగంగా ఉంటాయి.
మనిషికి అన్నిటి కన్నా ఎక్కువ భద్రత భావనను కలిగించేది డబ్బు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ నచ్చిన దాని కన్నా డబ్బుతో కుటుంబానికి భద్రత ఇవ్వాలని తాపత్రయపడుతున్న నేటి యువత కోల్పోతున్న జీవితపు ఆనందాన్ని గురించి చెప్పే కథ ‘బుటునా’. ఈ కథలో అనేక చోట్ల రచయిత వాక్యవిన్యాసాలు సూటిగా హృదయాన్ని తాకుతాయి.
స్త్రీలపై జరిగే అత్యాచారాలకు సమాజ స్పందన బయటకు ఒకలా కనిపించినా బాధితురాలు- బాధితుడి మతాల సమీకరణ ఎప్పుడు ముఖ్య ప్రాముఖ్యత వహిస్తుందనేది కాదనలేని సత్యం. ఈ విషయాన్ని పరోక్షంగా చెప్తూ, హిజ్రాలపై దాడి, వారిని దోచుకుంటూ, వారికి కనీస గౌరవం ఇవ్వని మనుషుల గురించి చెప్పే కథ ‘జయమాలిని’. ఒక ప్రత్యేక ప్రపంచంగా ఏర్పడి థర్డ్‌ జెండర్‌ వాళ్ళు తమ సంతోషాలను, బాధలను, అనుభూతులను పంచుకుంటూ సమాజం అంగీకరించని పరిస్థితుల్లో, అవమానాలకు గురవుతూనే, మనిషితనంలో ఎదగని మనుషుల మధ్య కూడా తమ సంస్కారాన్ని నిలుపుకునే వారి పట్ల పాఠకులకు ఈ కథ చదివితే గౌరవం రెట్టింపు కాక మానదు.
‘ఇబ్లీస్‌’ కథ చదువుతుంటే ‘ఎంత గొప్ప కథ రాశాడు రచయిత!’ అన్న భావన కలుగక మానదు. మతం మనిషిలో ఒకరి కోసం ఎంతో మంది ఉంటారన్న భరోసాను కలిగిస్తుంది. కానీ మతోన్మాదం మనిషిని రాక్షసుడిని చేస్తుంది. వ్యక్తికి మతం పట్ల గౌరవం ఉండాలి తప్ప, దాని కోసం మనిషిగా ఉండలేని వాతావరణాన్ని ఏర్పరిచే సంకెళ్లతో బంధి కాకూడదని, ‘మతం కన్నా మానవత్వం గొప్పదని’ చెప్పే కథ ఇది. దీనికి నేపథ్యంగా ‘మిలాదున్న’ పండుగ వేడుకలను తీసుకోవడం, పిల్లలను చిన్నప్పటి నుండే ఏది వాస్తవం? ఏది కాదు? ఏది మూఢ నమ్మకం? వంటి విషయాల గురించి తెలుసుకునేలా చేయలేకపోతే వారు ప్రమాదకరులుగా మారే అవకాశం ఉందని చాలా గట్టిగా చెప్పిన కథ.
సమాజంలో ఉన్న అసమానతలను భిన్న కోణంలో పరిచయం చేసే కథ ‘కోపిన్‌ బియ్యం’. ‘గుండె గది.’ కోవిడ్‌ సమయంలో మనుషులు మనుషులు కాకుండా మారిపోయిన తరుణంలో ఓ వృద్ధ జంట ప్రేమను, ఆ ప్రేమతో వారు కరోనాను జయించిన తీరును హృద్యంగా రాసిన కథ ‘గుండె గది’. ముస్లిముల కుటుంబాల్లో ముఖ్యంగా తల్లిదండ్రులు లేని ఆడపిల్లలను పైకి చూసుకునే బాధ్యత తీసుకున్నా, ఆ ముసుగులో వారిని వ్యాపార వస్తువులుగా మార్చుకునే వారి నుండి, ఇద్దరూ అక్కాచెల్లెళ్ళు ఎలా తప్పించుకున్నారో చెప్పే కథ ‘చమ్కీ’.
దేశం కానీ దేశంలో సంపాదన కోసం యవ్వనమంతా కరిగించుకుని ఉండి, డబ్బు పరంగా లోటు లేకుండా కుటుంబాన్ని స్థిరపరిచి, వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సంపాదనాపరుడికి మిగిలేది ఏమిటి? కోల్పోయిన యవ్వనం, కోల్పోయిన కుటుంబ అనుభూతులు, భార్యతో ముద్దు ముచ్చట్లు. ఈ నేపథ్యంలో దినార్ల కోసం మనసుకు అయ్యే గాయాలకు మందు లేదని చెప్తూ, ఎందరో భార్యాభర్తలు తమ యవ్వనాన్ని, నడి వయసును కోల్పోతూ చివరకు ‘ఏం మిగిలింది?’ అని బాధ పడే జీవితాలను పరిచయం చేసే కథ ‘దినార్‌ గాయం’. ఇవి కాక ఇందులో ‘ఆత్మకథ, చింత, దేవ్లానాయక్‌, నమిత, దిద్దుబాటు’ కథలు వున్నాయి.
ప్రతి కథారచయిత కథల్లో భిన్నత ఉన్నా, కథన క్రమంలో మాత్రం ఒక భావమో, వాదమో లేక అభిప్రాయమో తప్పకుండా ఆ కథల్లో స్థిరంగా ఉంటుంది. సంఘీర్‌ ఈ ‘ఇల్లింత పండ్లు’ కథల్లో, మనిషి ప్రకృతి నుండి దూరంగా జరగకూడదని, బాల్యంలో పల్లెటూరి జీవితంలో ఉన్న మధుర స్మృతులను వీలుంటే ఇప్పుడు కూడా పునరావృతమయ్యేలా చేసుకోగలిగితే ఆ అవకాశం వదులుకోకూడదని, బాల్యంలో చూసిన వాటిని గొప్ప జ్ఞాపకాలుగా మనసులో స్థిరపరుచుకుంటే, అవి ఓ కొత్త బలాన్ని ఇస్తాయన్న భావన ఉంది. సమాజంలో అసమానత్వం కులం, మతం, వర్గం వంటి వాటి మీద ఉండటం నాణేనికి ఒక వైపు అయితే ప్రతిభా చౌర్యం వల్ల జరిగే అన్యాయం వల్ల తలెత్తే అసమానత్వం ఇంకో వైపు ఉంది. బయటకు కనిపించకుండా జరిగిపోయే వీటిని గుర్తించి, ఎదిరించాలన్న వాదము ఉంది.
హుమాయున్‌ సంఘీర్‌ మొదటి కథా సంపుటి ‘కామునికంత’కు ‘శ్రీమతి కొలకలూరి భాగీరథీ కథానిక పురస్కారం-2024’ ప్రకటించారు. ఇప్పటి రెండవ కథాసంపుటి కూడా పల్లెటూరి పచ్చికల్లో మన సేదతీరిస్తూ, అక్కడి జీవనంలో ప్రకృతితో మమేకమయ్యే ఆహ్లాదమైన భావనను కలిగిస్తాయి. గొప్ప కథా నేర్పుతో, వాక్య విన్యాసాలతో, పల్లెటూరి మనసులను స్వచ్చంగా బయలు పరిచే పదజాలంతో, లోతైన అంశాలను సున్నితంగా, ప్రశ్నించాల్సిన అంశాల పట్ల ఘాటుగా స్పందిస్తూ రాస్తున్న హుమాయున్‌ సంఘీర్‌ గారికి ఈ సందర్భంగా అభినందనలు. జీవితంలో మధురస్మృతులుగా మారే జ్ఞాపకాలను మీ గుండెగదుల్లో పదిలం చేసుకోవాలంటే మీరు కూడా ఈ ‘ఇల్లింత పండ్లు’ తప్పకుండా చదవండి.

– శృంగవరపు రచన

Spread the love