– రాణించిన రాహుల్, దీపక్ హుడా
– లక్నో సూపర్జెయింట్స్ 196/5
లక్నో : ఎకానె పార్క్లో రాజస్థాన్ రాయల్స్పై లక్నో సూపర్జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ (76, 48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు), దీపక్ హుడా (50, 31 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీలతో మెరిశారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (7), ఫామ్లో ఉన్న ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ (0) నిష్క్రమణతో లక్నో స్వల్ప స్కోరుకు పరిమితం అవుతుందని అనుకున్నారు. కానీ మూడో వికెట్కు రాహుల్, దీపక్ హుడా భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. పవర్ప్లేలో చూపించిన దూకుడు.. మిడిల్ ఓవర్లలోనూ కొనసాగించారు. లక్నోలో తొలిసారి 200 ప్లస్ స్కోరు సాధ్యమే అనిపించిన దశలో డెత్ ఓవర్లలో సూపర్జెయింట్స్ లయ కోల్పోయింది. నికోలస్ పూరన్ (11), ఆయుశ్ బదాని (18), కృనాల్ పాండ్య (15 నాటౌట్) ఆశించిన వేగంతో పరుగులు చేయలేదు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి లక్నో సూపర్జెయింట్స్ 196 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ (2/31), రవిచంద్రన్ అశ్విన్ (1/39) రాణించారు.