అదానీ గ్రూపునపై ఆగస్టులో సుప్రీం విచారణ

న్యూఢిల్లీ : అదాని గ్రూపు కంపెనీలు తీవ్ర ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సెబీ సమర్పించిన రిపోర్ట్‌పై ఆగస్ట్‌లో విచారణ జరపనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. అదాని కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయనే హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌పై సెబీ విచారణ జరిపి 41 పేజీలతో కూడిన నివేదికను సోమవారం అత్యున్నత న్యాయస్థానానికి అందించింది. దీనిపై ఇంకా విచారణ జరుగుతుందని.. కొంత సమయం ఇవ్వాలని సెబీ కోరడంతో న్యాయస్థానం మంగళవారం అంగీకరించింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి డివై చండ్రచుడ్‌ ధర్మాసనం విచారిస్తూ.. ఆగస్టు 14 వరకు పూర్తి విచారణ రిపోర్ట్‌కు గడువు ఇచ్చింది. నికర ఆస్తులతో సంబంధం లేకుండా అదానీ గ్రూపు కంపెనీల షేర్లు కృత్రిమ పద్దతిలో భారీగా పెంచుతున్నారనే హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరపాలని.. ఇన్వెస్టర్ల ఆసక్తులను కాపాడాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Spread the love