పీఆర్‌ ఇంజినీరింగ్‌ శాఖ పునర్వ్యవస్థీకరణపై మంత్రులకు కృతజ్ఞతలు

నవతెలంగాణ-హైదరాబాద్‌
రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖను భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర మంత్రులను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పంచాయతీరాజ్‌ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రెబెల్లి దయాకర్‌రావును కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చారు. శాఖ పునర్వ్యవస్థీకరణ మూలంగా పీఆర్‌ ఇంజినీరింగ్‌ శాఖ పనితీరు చాలా మెరుగుపడుతుందనీ, తద్వారా మంచి ఫలితాలు తీసుకురావడానికి అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఆయా స్థాయిల్లో ప్రభుత్వం ఇటీవల 87 పోస్టులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మంత్రులను కలిసినవారిలో పీఆర్‌ ఇంజినీరింగ్‌ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఏజీ సంజీవరావు, సీఈ జీ సీతారాములు, ఎస్‌ఈ అశోక్‌, సురేశ్‌చంద్రారెడ్డి, ఈఈ ముజీబ్‌, డీఈ చంద్రమౌళి తదితర అధికారులు ఉన్నారు.

Spread the love