ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్‌

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా బ్రిడ్జిటౌన్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 36 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. కంగారూలు నిర్దేశించిన 202 ప‌రుగుల భారీ లక్ష్య‌ఛేద‌న‌లో ఇంగ్లండ్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 165 ర‌న్స్‌కే ప‌రిమిత‌మైంది. దీంతో ఆసీస్ ఘ‌న విజ‌యం సాధించింది.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 201 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా బ్యాట‌ర్ల‌లో ట్రావిస్ హెడ్ 34, డేవిడ్ వార్న‌ర్ 39, మిచెల్ మార్ష్ 35, మ్యాక్స్‌వెల్ 28, స్టొయినిస్ 30 ప‌రుగుల‌తో రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో క్రిస్ జోర్డాన్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చ‌ర్‌, ర‌షీద్‌, లివింగ్‌స్టోన్ త‌లో వికెట్ తీశారు.
అనంతరం 202 ప‌రుగుల భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ జ‌ట్టుకు ఓపెన‌ర్లు ఫిల్ సాల్ట్ (37), బ‌ట్ల‌ర్ (42) 73 ప‌రుగుల మంచి భాగ‌స్వామ్యం అందించారు. కానీ, ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన బ్యాట‌ర్లు రాణించ‌లేక‌పోయారు. ఐపీఎల్ అద‌ర‌గొట్టిన‌ విల్ జాక్స్‌(10), జానీ బెయిర్‌స్టో (07) ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. మ‌ధ్య‌లో మొయిన్ అలీ (25) బ్రూక్స్ (20) నిల‌దొక్కునే ప్ర‌య‌త్నం చేసినా.. అప్ప‌టికే ర‌న్‌రేట్ బాగా పెరిగిపోవ‌డంతో ఇంగ్లీంష్ జ‌ట్టుకు ల‌క్ష్య‌ఛేద‌న క‌ష్టంగా మారింది. చివ‌రికి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 165 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో ఆసీస్ 36 ర‌న్స్ తేడాతో బంప‌ర్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో ఆడమ్ జంపా, ప్యాట్ క‌మిన్స్ చెరో 2 వికెట్లు తీస్తే.. స్టొయినిస్, హెజిల్‌వుడ్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. త‌న 4 ఓవ‌ర్ల కోటాలో 28 ప‌రుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన జంపాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Spread the love