– బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ
– కాంగ్రెస్ పాలనను ఇంటింటికీ తీసుకెళ్లి ఎండగట్టండి
– మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
నవతెలంగాణ-సత్తుపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సత్తుపల్లిలోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్హాలులో నిర్వహించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా, పార్టీ యువజన విభాగం ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో నామ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు ఎలా ఉందో ప్రజలకు అర్థమయ్యేలా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం జరగాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న నన్ను గెలిపించేందుకు యువత బాధ్యత తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ యువతకు కేసీఆర్ ప్రభుత్వంలో పెద్దఎత్తున అవకాశాలను కల్పించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని తెలిపారు. యువజన విభాగం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజల్లో ఎండగట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు ఎస్కే. రఫీ, యాగంటి శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సోషల్ మీడియా బాధ్యులు, నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.