బ్రిక్స్‌ కూటమిలో మరో ఆరు దేశాలు

There are six other countries in the BRICS alliance–  చైనా అధ్యక్షుడితో మోడీ మాటామంతి
జోహెన్స్‌ బర్గ్‌ : బ్రిక్స్‌ కూటమిలో మరో ఆరు దేశాలు సభ్యులుగా చేరనున్నాయి. బ్రిక్స్‌ కూటమిలో మరో ఆరు దేశాల కొత్త సభ్యులను చేర్చుకోనున్నట్టు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా గురువారం ప్రకటించారు. ” మేం బ్రిక్స్‌లో పూర్తి సభ్యులు కావడానికి అర్జెంటీనా, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా , యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాం. 2024 జనవరి నుంచి ఆయా దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుంది ” అని రమాఫోసా జోహెన్స్‌ బర్గ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పేర్కొన్నారు. బ్రిక్స్‌ 15వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా.. బ్రిక్స్‌ను విస్తరించాలన్న కీలక నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బ్రిక్స్‌ విస్తరణ సభ్య దేశాల సహకారానికి కొత్త ఉత్సాహాన్నిస్తుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తెలిపారు. ఈ విస్తరణ బ్రిక్స్‌ ఐక్యత , సహకారం సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రస్తుతం బ్రిక్స్‌ కూటమిలో బ్రెజిల్‌, రష్యా, చైనా, భారత్‌, దక్షిణాప్రికాలు సభ్యదేశాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
జిన్‌పింగ్‌తో మోడీ
బ్రిక్స్‌ సదస్సులో భారత్‌-చైనా అధినేతల మధ్య ప్రత్యేక భేటీ ఉంటుందా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నప్పటికీ అలాంటి సమావేశం జరగలేదు. కానీ, వేదికపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య సంభాషణ చోటుచేసుకుంది. మోడీ ఏదో చెబుతుండగా.. జిన్‌పింగ్‌ దాన్ని వింటూ ముందుకు సాగారు. సమావేశం అనంతరం ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Spread the love