నిర్ణయానికి సమయమున్నది

రిటైర్మెంట్‌పై ఊహాగానాల నేపథ్యంలో
ధోనీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ఐపీఎల్‌ నుంచి రిటైర్మెంట్‌ విషయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ అనేక ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకటనలలో అంతరార్థం ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కటం లేదు. అసలు ధోని మనసులో ఏమున్నదో అన్నదానిపై క్రీడాలోకంలో తీవ్ర ఆసక్తి నెలకొన్నది. ఈ తరుణంలో ధోని కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌ టైటాన్స్‌తో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో విజయం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ”నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉన్నది. ఎందుకంటే తదుపరి ఐపీఎల్‌ వేళం ఈ ఏడాది డిసెంబర్‌లో ఉన్నది. నాకింకా 8 నుంచి 9 నెలల సమయం ఉన్నది. ఆ తలనొప్పి ఇప్పుడెందుకు?” అని ధోని అన్నాడు. అయితే, ధోని ప్రకటనతో ఐపీఎల్‌ నుంచి ఆయన నిష్క్రమిస్తారన్న వార్తలకు తాత్కాలికంగా తెరపడిందని క్రీడా నిపుణులు కొందరు తెలిపారు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన సీఎస్‌కే.. పదోసారి ఐపీఎల్‌ ఫైనల్‌లో అడుగు పెట్టింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్స్‌ను 15 పరుగుల తేడాతో ఓడించిన సీఎస్‌కే.. ఐపీఎల్‌ ట్రోఫీ రేసులో మరోసారి నిలిచింది.

Spread the love