కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు చూసి ఏదేదో మాట్లాడుతున్నారు..

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశం మొత్తం మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందని పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ శిక్షణా శిబిరాన్ని కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలకు కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. ‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. ఏం జరిగింది? ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు. దేశం మొత్తం తెలంగాణ మోడల్‌ అమలు కావాలి. అమూల్యమైన నీటిని కూడా వాడుకోలేక వృథా చేస్తున్నాం. ఏటా వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. సాగుకు నీరు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అకోలా, ఔరంగాబాద్‌లో వారానికోసారి తాగునీరు ఇస్తున్నారు. దేశం మొత్తం దాదాపు ఒకే తరహా పరిస్థితి ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన రైతు ఉద్యమాలు జరిగాయి. ఆందోళనల్లో ఎందరో రైతులు తూటాలకు బలయ్యారు. రైతులంటే గౌరవం లేదా? నిత్యం పోరాడుతూనే ఉండాలా?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

Spread the love