భూ తగాదాలకు ముగ్గురు బలి

నవతెలంగాణ – ఆసిఫాబాద్‌
భూ తగాదాలకు ఓ మహిళ ముగ్గురు బలయ్యారు. కొడవళ్లు, గొడ్డళ్లతో ప్రత్యర్థులు దాడి చేసుకోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బన మండలం జక్కులపల్లిలో సోమవారం చోటు చేసుకున్నది. భూతగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. దాంతో ఓ వర్గంపై ప్రత్యర్థి వర్గం దాడికి గొడ్డళ్లు, కత్తులతో దాడికి దిగారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళ సైతం ఉన్నది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని, వారిని మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతులను మండల లింగయ్య, మండల నరసయ్య, గిరుగుల బక్కమ్మగా గుర్తించినట్లు తెలుస్తున్నది. ఘటనలో మండల సంతోష్‌, మండల దుర్గయ్య గాయపడ్డట్లుగా తెలుస్తున్నది. మధ్యాహ్నం సమయంలో జక్కులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న భూమిలో ఈ ఘర్షణ జరిగిందని, ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లినట్లు సమాచారం. దాడిలో దాదాపు 15 మంది కలిసి ఓ వర్గంపై దాడికి పాల్పడ్డట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Spread the love