– ఆశల పల్లకిలో ఆశవాహులు
– ఎనిమిది మంది దరఖాస్తు
– ముగ్గురి మధ్య పోటీ
– పట్టుబడుతున్న పొంగులేటి, రేణుక, భట్టిలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
నామినేషన్ల స్వీకరణ గడువు దగ్గర పడుతున్నప్పటికీ అశ్వారావుపేట టికెట్ను కాంగ్రెస్ రెండో జాబితాలోనూ ఎవరికి ప్రకటించక పోవడంతో పార్టీ శ్రేణులు మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే క్రమంలో ఆశావాహులు ఎవరికి వారు తనకు టికెట్ వస్తుందని ఆశలు పల్లకిలో ఊహల కలలు కంటున్నారు. వీరికి తగ్గట్టు గానే తన సూచించిన అభ్యర్ధి కే బెర్త్ ఖాయం చేయాలని పొంగులేటి, రేణుక, భట్టి విక్రమార్కలు గట్టిగా పట్టుబడుతున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నియోజక వర్గం మొదటి నుండి కాంగ్రెస్కు కంచుకోటగా నే ఉంటుంది. మొదటి ఎమ్మెల్యే మిత్ర సేన కాంగ్రెస్ అభ్యర్ధిగా, రెండో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధిగా, ప్రస్తుత ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్ధిగా విజయం సాధించారు. దీంతో ఈ ఈ టికెట్కు కాంగ్రెస్ పార్టీ నుండి తాటి వెంకటేశ్వర్లు, సున్నం నాగమణి, జారే ఆదినారాయణ, వగ్గెల పూజ, ధంజు నాయక్, మరో ముగ్గురు కలుపుకుని మొత్తం ఎనిమిది మంది దరఖాస్తు చేసారు. అయితే సున్నం నాగమణి మొదటి నుండి ఇదే పార్టీలో కొనసాగుతూ, పీసీసీ మహిళా విభాగం నాయకురాలుగా, ప్రస్తుతం ములకలపల్లి జెడ్పీటీసీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. తాటి వెంకటేశ్వర్లు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, సంవత్సరం ముందే కాంగ్రెస్ చేరారు. జారే ఆదినారాయణ బీఆర్ఎస్ నుండి పొంగులేటి అనుచరుడిగా ఇటీవలే పార్టీలో చేరారు. వీరి ముగ్గురిలో సున్నం నాగమణి తరుపున మల్లు బట్టి విక్రమార్క, తాటి వెంకటేశ్వర్లుకు మద్దతుగా రేణుకా చౌదరి, తుమ్మల నాగేశ్వరరావు, జారే ఆదినారాయణను నేను గెలిపించుకునే పూచీ నాది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు గట్టి పట్టుబడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖరారు కాని వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట టికెట్లు ఈ నెల 31న అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ సీటు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.