విశ్వక్‌ ఇక డైరెక్షన్‌ ఆపేరు.. – ఎన్టీఆర్‌

హీరో విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’. ఈ చిత్రానికి ఆయన హీరో మాత్రమే కాదు దర్శకుడు, నిర్మాత కూడా. నివేదా పేతురాజ్‌ నాయిక. ఈ నెల 22న ఉగాది కానుకగా గ్రాండ్‌ ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా మాసీవ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ,’ఈ వేడుకకు రావడం నా బాధ్యత. తక్కువ సమయంలో పరిణితి సాధించిన నటుడు విశ్వక్‌. ఇది అందరికీ సాధ్యపడదు. ఇప్పుడు తన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలి. ఎందుకంటే తను దర్శకత్వం ఆపేయాలని కోరుకుంటున్నాను. బయట చాలా మంది దర్శకులు ఉన్నారు. కొత్తకొత్త వాళ్లకి విశ్వక్‌ లాంటి వారు అవకాశాలు ఇవ్వాలి. అలాంటి వాళ్ళని చూసి, మేము వాళ్ళతో సినిమాలు చేయాలి. ‘అన్నా ఈ సినిమా కోసం ఉన్నదంతా పెట్టశాను.. మీరు ప్రీ రిలీజ్‌కి రావాలి’ అని విశ్వక్‌ అన్నప్పుడు నాకు చాలా బాధేసింది. అలాగే సినిమాలు చేయాలనే తన పిచ్చి కూడా అర్ధమైంది. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. ఉగాది పండగ రోజు విశ్వక్‌కి నిజమైన పండగ రావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘ఎన్టీఆర్‌ ఇక్కడికి వచ్చింది నా ఒక్కడి కోసం కాదు. ఆయన అభిమాని కోసం, ఇచ్చిన మాట కోసం. నాకు తోడుగా ఎన్టీఆర్‌ అన్నని దేవుడు పంపించాడు. నాకు బ్లాక్‌బస్టర్‌ స్టార్‌ అయిపొయింది. నందమూరి అభిమానులందరికీ కతజ్ఞతలు. నా ప్రాణం, డబ్బులన్నీ పెట్టి చేసిన సినిమా ఇది. ఉగాదికి వస్తున్న ఈ సినిమా జస్ట్‌ ఫిల్మ్‌ కాదు. విశ్వక్‌ సేన్‌ 2.0. ఉగాది రోజున ప్రతి ఒక్కడి సీట్‌ షేక్‌ అవుతుంది’ అని హీరో విశ్వక్‌ సేన్‌ అన్నారు.

Spread the love