సందేశాత్మకంగా సిరిమల్లెపువ్వు

షకీరా మూవీస్‌ పతాకంపై శ్రీకర్‌ కృష్ణ, శ్రావణి నిక్కీ, అజరు ఘోష్‌, జయ నాయుడు, అమ్మ రమేష్‌, షఫీ క్వాద్రి నటీనటులుగా గౌతమ్‌ మైలవరం దర్శకత్వంలో కౌసర్‌ జహాన్‌ నిర్మించిన చిత్రం ‘సిరిమల్లె పువ్వా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సినీ పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన డైరెక్టర్‌లు చంద్రమహేష్‌, సముద్ర, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్‌ ఈ చిత్రంలోని పాటలను, టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కౌశర్‌ జహాన్‌ మాట్లాడుతూ, ‘దర్శకులు గౌతమ్‌ సమాజానికి మంచి మెసేజ్‌ ఇవ్వాలనే ఆలోచనతో, ఆశయంతో ఈ సినిమా తీశారు. ఒక ట్రైబల్‌ అమ్మాయి ఒక అబ్బాయిని స్వచ్చంగా ప్రేమిస్తే ఎన్ని ఇబ్బందులు పడింది?, అలాగే అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయం ఏమిటి అనేది చూపిస్తూ ఈ సినిమాలో ఒక మంచి సందేశం ఇచ్చాం’ అని చెప్పారు. ‘ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. సినిమాలపై నాకు ఉన్న అభిరుచిని గుర్తించి అవకాశం ఇచ్చిన నిర్మాత కౌసర్‌ జహాన్‌కి థ్యాంక్స్‌’ అని దర్శకుడు గౌతమ్‌ అన్నారు. హీరో శ్రీకర్‌ కృష్ణ మాట్లాడుతూ, ‘ఇలాంటి మంచి కథకి నన్ను సెలెక్ట్‌ చేసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని చెప్పారు. హీరోయిన్‌ నిక్కీ శ్రావణి మాట్లాడుతూ,’గిరిజన నేపథ్యంలో వస్తున్న భిన్న సినిమా ఇది’ అని తెలిపారు.

Spread the love