మంచి సినిమా తీశాననే పేరొచ్చింది..

”సామజవరగమనా’ కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. శ్రీ విష్ణు ఇంతవరకూ చేయని జోనర్‌. ‘నువ్వు నాకు నచ్చావ్‌, నువ్వు లేక నేను లేను, గీత గోవిందం’లా ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. ఈ సినిమాని సమ్మర్‌ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం. అలాగే సందీప్‌ కిషన్‌ ‘ఊరు పేరు భైరవకోన’ చాలా పెద్ద స్కేల్‌లో సూపర్‌ నేచురల్‌ ఫాంటసీగా చేస్తున్నాం. ఇందులో గ్రాండ్‌ విజువల్స్‌, మంచి ఫన్‌,పాటలతో పాటు అన్నీ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. జులై లేదా ఆగస్ట్‌లో రిలీజ్‌కి ఫ్ల్లాన్‌ చేస్తున్నాం’ అని అన్నారు నిర్మాత రాజేష్‌ దండా. సందీప్‌ కిషన్‌, వి.ఐ.ఆనంద్‌ కాంబినేషన్‌లో’ఊరు పేరు భైరవకోన’, శ్రీవిష్ణు, రామ్‌ అబ్బరాజు కాంబోలో తెరకెక్కిన ‘సామజవరగమనా’ చిత్రాలను హాస్య మూవీస్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర సమర్పణలో రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ రెండు చిత్రాల విశేషాల గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ”స్వామిరారా’ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్‌గా నా ప్రయాణం మొదలైంది. ‘కేరాఫ్‌ సూర్య’, ‘ఒక్క క్షణం, నాంది’ సినిమాలకి కోప్రొడ్యూసర్‌గా చేశాను. ‘నాంది’ విడుదల తర్వాత మనమే ఎందుకు నిర్మాతగా చేయకూడదని అనిపించింది. ఆ సంకల్పంతోనే ‘హాస్య మూవీస్‌’ బ్యానర్‌ స్టార్ట్‌ చేశాను. అనిల్‌ సుంకరతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన సపోర్ట్‌తో మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నాను. మేం చేసిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ మాట పక్కన పెడితే మంచి సినిమా తీశాననే పేరు తీసుకొచ్చింది. ఆగస్ట్‌లో నరేష్‌తో సోలోగా ఒక సినిమా చేయబోతున్నా. ‘సోలో బ్రతుకే సొ బెటరు’ ఫేం సుబ్బు దీనికి దర్శకత్వం వహిస్తారు. శ్రీవిష్ణుతో మరో సినిమా, సాయి ధరమ్‌ తేజ్‌తో, అలాగే ‘నాంది’ దర్శకుడు విజరు కనకమేడలతో కూడా ఓ సినిమా చేయాలనే ఆలోచన ఉన్నాను’ అని చెప్పారు.

Spread the love