చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది

– జీవో 111 రద్దు ఫలితంగా జంట నగరాలకు తీవ్ర వరద ప్రమాదం
ప్రొఫెసర్‌ దొంతి నరసింహారెడ్డి
– హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో మానవహారం
నవతెలంగాణ-అడిక్‌ మెట్‌
హుస్సేన్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌, హిమయత్‌ సాగర్‌ లాంటి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పర్యావరణవేత్త, ప్రొఫెసర్‌ దొంతి నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో సంఘం ప్రధాన కార్యదర్శి కే వీరయ్య అధ్యక్షతన ”సేవ్‌ హుస్సేన్‌ సాగర్‌ – సేవ్‌ హైదరాబాద్‌” నినాదంతో ట్యాంక్‌బండ్‌ పై మానవహారాన్ని నిర్మించారు. కార్యక్రమానికి దొంతి నరసింహారెడ్డి హాజరై మాట్లాడారు. జీఓ నెం 111 రద్దు ఫలితంగా హైదరాబాద్‌ జంట నగరాలకు తీవ్ర వరద ప్రమాదం ముంచుకొస్తుందని, వెంటనే ఆ జీవోను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పర్యావరణవేత్త సాగర్‌ ధారా మాట్లాడుతూ.. గతంలో హుస్సేన్‌సాగర్‌ శుద్ధికి ప్రభుత్వం నియమించిన కమిటీలో తానూ ఉన్నానని, హుస్సేన్‌ సాగర్‌లో చేరే కాలుష్యాలను అరికడితే క్రమంగా దాన్ని కాలుష్య రహితంగా మార్చవచ్చని అన్నారు. ఈ సంవత్సరం ఐరాసా అంతర్జాతీయంగా ప్లాస్టిక్‌ కాలుష్యంపై పోరాడాలని పిలుపునిచ్చిందని, ప్లాస్టిక్‌ను నియంత్రించాలని, అందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. మెజీషియన్‌ చొక్కాపు వెంకటరమణ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని, అందుకనుగుణంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ప్రజలందరూ సహకరించాలని కోరారు. సామాజిక వేత్త చుంచు రాజీవ్‌ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి ”బీట్‌ ప్లాస్టిక్‌ పొల్యూషన్‌’ నినాదాన్ని ఇచ్చిందని, ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ ప్రపంచ మానవాళికే ముప్పుగా పరిణమించిందన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో సముద్రాలు సైతం కాలుష్యమయ్యే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తున్నామని, విద్యార్థుల స్థాయి నుంచి చైతన్యాన్ని పెంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. మానవహారంలో.. పి.శ్రీనివాసరావు, నగేష్‌, రాజమౌళి, మోహన్‌, మాధవి, మోహన్‌ నాయుడు, నాగేశ్వరరావు, సైదులు, గోపాల్‌, సుకుమార్‌, సంగీత, హస్మిత, సంజీవరెడ్డి, జెకె శ్రీనివాస్‌, కష్ణమోహన్‌, మేఘన, నరసింగరావు,అజయ్, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love