‘ఒకే పింఛన్‌’ అమలు చేస్తారా?

వికలాంగులకు సామాజిక భద్రత సాధన కోసం ఈనెల 10న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద వేలాది మంది వికలాంగులు మహాధర్నాకు సిద్ధమవుతున్నారు. జూన్‌ 1 నుండి జూలై 9 వరకు కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్‌ నుండి త్రిపుర వరకు సామాజిక భద్రత, అంత్యోదయ కార్డులు, ఉపాధి హామీ చట్టంలో పని కల్పించాలని, దేశ వ్యాప్తంగా ఒకే పింఛన్‌ అమలు చేయాలని గ్రామ గ్రామాన కరపత్రాలు, పోస్టర్స్‌ ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. మండల, జిల్లా కేంద్రాల్లో సదస్సులు, సెమినార్స్‌, చర్చావేదికలు నిర్వహించి చలో ఢిల్లీకి సన్నద్ధ మయ్యారు. వాస్తవానికి వికలాంగుల సమస్యలు పాలకులకు పట్టింపులేదు. వారి సంఖ్యను కూడా తక్కువ చూపే ప్రయత్నం జరుగుతున్నది. దేశంలో 2011జనాభా లెక్కల ప్రకారం (7రకాల వైకల్యాల ప్రకారం) 2.68కోట్ల మంది వికలాంగులున్నారు. వీరిలో పురుషులు1.50కోట్ల మంది, స్త్రీలు1.18కోట్ల మంది. గ్రామీణ ప్రాంతంలో 69.4శాతం, పట్టణ ప్రాంతంలో 30.6శాతం మంది నివసిస్తున్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన 21రకాల వైకల్యాల ప్రకారం దేశ జనాభాలో 10 నుండి 15శాతం మంది వికలాంగులు ఉంటారని అంచనా. మన రాష్ట్రంలో 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10,46,820 మంది వికలాంగులున్నారని తెలపగా, తెలంగాణ వికలాంగుల సర్వే ఇండియా రిపోర్ట్‌ ప్రకారం 43.02లక్షల మంది వికలాంగులు ఉన్నట్టు తేలింది. వీరిలో 5.16లక్షల మందికే పెన్షన్లు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సాధికారత విభాగం వెల్లడించిన రిపోర్ట్‌ ప్రకారం 49.5శాతం మంది ప్రభుత్వ పథకాలే పొందడం లేదు. ఐక్య రాజ్య సమితి హక్కుల ఒప్పందం ఆర్టికల్‌ 23 ప్రకారం వైకల్యంతో బాధపడుతున్న వికలాంగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి జీవించే హక్కు, సమాజంలో గౌరవంగా అందరితో కలిసి జీవించే హక్కుతో పాటు స్వతహాగా నిర్ణయాలు తీసుకునే హక్కును కల్పించింది. సమాజంలో వికలాంగుల పట్ల వివక్షత, అవమానాలు, అన్యాయాలు కొనసాగుతున్నాయి. మహిళా వికలాంగులు, బాలికలు, మూగ చెవిటి, మానసిక, మహిళా వికలాంగులపై లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంగవైకల్యం కలిగిన వారికి సమాజంలో, ఇంట్లో సైతం గుర్తింపు లేదు. వికలాంగులను అదరించాల్సిన సమాజం చీదరిస్తుంటే కన్నవారు సైతం కాదు పొమ్మని వెలివేస్తుంటే దిక్కుతోచని స్థితిలో అవమానాలతో ఆత్మ హత్యలు చేసు కుంటున్నారు. వీరికి మనోధైర్యం కల్పించేందుకుగాను సామాజిక భద్రత ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఉన్నది.
ఐక్య రాజ్య సమితి హక్కుల ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం 2008లో సంతకం చేసింది.1995 పిడబ్ల్యూడి చట్టం స్థానంలో వికలాంగులకు మారిన పరిస్థితుల నేపథ్యంలో నూతన చట్టం చేయాలని 2011 నుండి దేశవ్యాప్తంగా ఎన్పీఆర్డీ నేతృత్వంలో అనేక ఉద్యమాలు జరిగాయి. పోరాటాల ద్వారా 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చింది. చట్టం అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నవి. 2016 ఆర్‌పిడబ్ల్యూడి చట్టం సెక్షన్‌ 89,92,93లకు సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాల ద్వారా కేంద్రం వెనక్కు తగ్గింది. నేషనల్‌ ట్రస్ట్‌, మెంటల్‌ హెల్త్‌ కేర్‌ ఆక్ట్‌, ఆటిజం చట్టం వంటివి మాత్రం అమలు చేయడం లేదు. నేషనల్‌ పాలసీ రూపొందించిన అమలుకు నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయనికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొట్టడం జరిగింది. చట్టాల అమలును పర్యవేక్షించేందుకు ఆర్‌పిడి చీఫ్‌ కమిషనర్‌, నేషనల్‌ ట్రస్ట్‌ కమిషనర్‌ పోస్టులు నేటికీ ఖాళీగా ఉన్నవి చట్టాల అమలు పట్ల పాలకులకు చిత్తశుద్ది లేదనడానికి నిదర్శనం. వికలాంగులకు అంత్యోదయ కార్డులు జారీ చేయాలని ఉన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని 2011లో రాజ్యసభలో బృందాకరత్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 2012 నుండి దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో అంత్యోదయ కార్డులు పంపిణీ చేశారు. కానీ ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో వికలాంగులు అంత్యోదయ కార్డులకు నోచుకోలేదు.
వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో తెచ్చిన ఉపాధి హామీ చట్టంలో వికలాంగులకు స్థానం లేదు. ఎన్నో రోజులుగా డిమాండ్‌ చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదు. 2023-24 వార్షిక బడ్జెట్లో… నిధులు కేటాయించి, వికలాంగులకు ప్రత్యేక జాబ్‌ కార్డులు జారీ చేయాలి. అలాగే 200రోజులు పనికల్పించి వేతనం రూ.600లకు పెంచాలి. దేశవ్యాప్తంగా వికలాంగులకు ఒక్కొక రాష్ట్రంలో ఒక్కకొరకమైన పెన్షన్‌ స్కీమ్‌ అమలు అవుతుంది. రూ.300 నుంచి మొదలై 3వేల వరకు ఉంటున్నది. ఈ తక్కువ నగదుతో కుటుంబాలను ఏ విధంగా పోషిం చుకుంటారు? ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే తిండి అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, దేశవ్యాప్తంగా వికలాంగులకు ఒకే పెన్షన్‌ అమలు చేస్తామని చెప్పే దైర్యం ఉందా? ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్‌ పెంచాలి. ఎలాంటి షరతులు, ఆదాయ పరిమితులు లేకుండా 40శాతం వైకల్యం కలిగిన వికలాంగులకు పెన్షన్‌ మంజూరు చేయాలి. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు వారి సహాయకులకు ప్రత్యేక అలవెన్స్‌ ఇవ్వాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో మహిళా వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళా వికలాంగులకు స్వయం ఉపాధి కోసం శిక్షణ ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు భర్తీ చేస్తున్న నామినేటెడ్‌ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్‌ అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేసి భర్తీ చేయాలి. ఈ హక్కుల సాధనకు వికలాంగులం దరూ ఐక్యమవ్వాలి. సామాజిక భద్రత సాధించేందుకు పోరాడాలి.
ఎం. అడివయ్య
9490098713

Spread the love