అంతర్థానవుతున్న మాతృభాషలు

మనిషి తన తల్లికి ఎంత దగ్గరగా ఉంటాడో మాతృభాషకు కూడా అంత దగ్గరగా ఉంటాడు. పిల్లవాడు,తన భాషా సామర్థ్యాన్ని తల్లి నుండి నేర్చుకుంటాడు. ఏ తల్లీ అప్పుడే పుట్టిన పిల్లాడికి ఎలాంటి వ్యాకరణ నిబంధనల్ని బోధించదు. అయినా, తన తల్లి పెదాల కదలికలు, ఆమె అభినయాలను గమనించడం ద్వారా, ఆమె మాటల ధ్వని, ఆ మాటల కూర్పును గ్రహించడం ద్వారా ఆ పిల్లాడు అంత సంక్లిష్టమైన నిబంధనల్ని అంతర్గతీకరించు కుంటాడు. పిల్లలు భాషలను పాఠశాలలో నేర్చుకుంటారనే ఒక విస్తృతమైన తప్పుడు అభిప్రాయం ఉంది. అది మాతృభాషేతర భాషల విషయంలో వాస్తవం కావచ్చు. ద్వితీయ, తృతీయ లేక ఇతర భాషల్ని వ్యాకరణం, అనువాదం ద్వారా నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ పిల్లవాడు మూడు సంవత్సరాల వయసొచ్చే సమయానికి మాతృభాషలోని దాదాపు అన్ని సంక్లిషష్టతలను నేర్చుకోవడానికి అనుగుణంగా మానవ మెదడు నిర్మితమై ఉంటుంది. లేఖనం (రైటింగ్‌) అనేది వేరే అంశం. కొన్ని మిలియన్‌ సంవత్సరాల మానవజాతి చరిత్రలో, లేఖనం అనేది ఏడు వేల సంవత్సరాల క్రితమే వ్యక్తీకరణకు, సమాచారాన్ని అందించే, జ్ఞాపకాలను నిలువ చేసే సాధనంగా మారింది. భాష అంటే ప్రాథమికంగా మాట్లాడటం. లేఖనం ద్వారా తరాల మధ్య సుదీర్ఘకాలం పాటు భాషాపరమైన సంబంధ బాంధవ్యాలకు అవకాశం ఇవ్వడం భాషకుండే అదనపు లక్షణం.
నా బాల్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మాతృభాష కాని ఇతర అనేక భాషలను వారాంతపు సంతల్లో జన సమూహాలు మాట్లాడడం స్వయంగా విన్నాను. ఆనాడు రేడియో అనేది మా గ్రామంలో సాపేక్షంగా ఓ కొత్త యంత్రపరికరం. ఇంట్లోకి కొత్త రేడియో సెట్‌ రావడంతో నేను ఎంతో ఆసక్తిగా స్టేషన్లను కలిపేందుకు ప్రయత్నించేవాడ్ని. వారాంతపు సంతల్లో వినని అనేక భాషల్ని రేడియోలో విన్నాను. దీంతో అసలు ఈ ప్రపంచంలో ఇంకా ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి నాలో పెరిగింది.
1970లో ఒక విశ్వవిద్యాలయం విద్యార్థిగా భారతీయ భాషలపై జనగణనకు సంబంధించిన చిన్న పుస్తకాన్ని చూశాను. దానిలో 109భాషల జాబితా ఉంది. ఆ జాబితాలో చివరన ”అన్ని ఇతర భాషలు” అని ఉంది. అంటే 108 భాషల కన్నా ఎక్కువ భాషలు ఉన్నాయనే దానికి ఇదొక సూచిక. ఇంతకన్నా ముందుగా జనాభా లెక్కల్లో మరికొన్ని వివరాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ లైబ్రరీలో 1961జనాభా గణాంకాల కోసం వెతికాను. ఆ గణాంకాలలో నేను దిమ్మతిరిగే విషయాలు గమనించాను. ఆ జాబితాలో 1652 భాషల్ని తమ మాతృభాషగా భారతీయులు పేర్కొన్నారు. పైన ఉదాహరించిన భాషల గణాంకాలకు సంబంధించి రెండు రకాల సంఖ్యల్ని పోల్చితే 10సంవత్సరాల కాలంలో (అంటే 1961-1971 మధ్య కాలంలో) భారతదేశం మొత్తం 1544 భాషల్ని కోల్పోయింది.
భాషా గణనను మామూలు అంక గణితం ద్వారా విభజించలేం. దానికి శిక్షణ పొందిన భాషా పండితుల పరిశీలన అవసరం ఉంటుంది. అందువలన భారతీయ జనగణన రిజిస్ట్రార్‌ వద్ద పని చేస్తున్న భాషా పండితులు, విద్యావిషయక నిష్ణ్టాతుల సాహిత్యంలో నమోదు చేయబడిన మాతృభాషల పేర్లు (జనాభా లెక్కల సమయంలో ప్రజలచే పేర్కొనబడిన) ఏమైనా ఉన్నాయేమోనని అందుబాటులో ఉన్న గ్రంథాలయ వనరుల్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి కచ్చితంగా సమయం తీసుకుంటుంది. అందువల్ల సాధారణంగా భాషకు సంబంధించిన గణాంకాలను చివరగా ప్రకటిస్తారు.
1971 భాషా గణనకు, భాషా గణాంకాల ప్రకటన మధ్య కాలంలో బంగ్లాదేశ్‌ యుద్ధం జరిగింది. తరువాత కాలంలో బంగ్లాదేశ్‌గా మారిన తూర్పు పాకిస్థాన్‌, పశ్చిమ పాకిస్థాన్‌ నుండి భాషా సమస్య పైనే విభజనను కోరింది. భారత ప్రభుత్వం భాషా వైవిధ్యం గురించి ఆందోళన చెంది, భాషల సంఖ్యను తగ్గించే మార్గాలను వెతికే నిర్ణయం చేసి ఉండి ఉన్నట్లైతే, అది సహజమేనని భావించాలి. అందుకుగాను ప్రభుత్వం ”పదివేల(భాషను మాట్లాడే వారి సంఖ్య) సంఖ్య” పరిమితిని విధించింది. ఈ సంఖ్యా పరిమితికి ఎలాంటి శాస్త్రీయమైన పునాది లేదు. ఒక భాషను భాషగా పరిగణించాలంటే ఆ భాషను మాట్లాడేవారు కేవలం ఇద్దరుంటే చాలు. పదివేల సంఖ్యను విధించడం అనేది ఉద్యోగస్వామిక (బ్యూరోక్రటిక్‌) అర్థంలేని భావన. కాని ఆ సంఖ్య గణాంకాల్లో (ఆ తరువాత దశాబ్దాల్లో చివరి 2011 జనగణన వరకు) అలాగే నిలిచి పోయింది. 1970 ప్రాంతంలో 1544 ”మాతృభాషలు” ఆకస్మికంగా మౌనం వహించాయా? కచ్చితంగా కాదు. అవి కొద్ది జనాభా ఉన్న భౌగోళిక ప్రాంతాల్లో కొనసాగాయి.
ప్రభుత్వ ఉనికికి సాక్షీభూతంగా ప్రభుత్వం కృత్రిమంగా విధించిన సీలింగ్‌ కారణంగా వాస్తవానికి ఎన్ని భాషలు అంతర్థానయ్యాయో తెలుసుకోవాలంటే 1971 జనగణనను 2011జనగణనతో పోల్చి చూడాలి. ప్రజలు తమ మాతృభాషగా పేర్కొన్న భాషల్ని లెక్కించడానికి అదే జనగణన పద్ధతిని అనుసరించగా భారతదేశంలో ప్రజలు 1369 భాషలను మాట్లాడుతున్నట్లు 2011 జనగణన నిర్థారించింది. రెండు సంఖ్యలను పక్కపక్కనే ఉంచి చూడటం ద్వారా 1961 నుండి 2011 అంటే 50సంవత్సరాల్లో (1652-1369-283)283 భాషలు అంతరించి పొయ్యాయనే నిర్థారణకు ఎవరైనా రావచ్చు. అంటే సంవత్సరానికి సగటున నాలుగు లేక ఐదు భాషలు లేదా ప్రతీ రెండు లేక మూడు నెలలకొక భాష అంతరించినట్టు అర్థం చేసుకోవాలి. గతంలో ఓ వెయ్యి సంవత్సరాల పాటు ”అంతర్థానమైన” భాషలు ఉనికిలో ఉన్నాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, భారతదేశంలో భాషల అంతర్థాన రేటు గుండెలు అదిరిపోయే విధంగా ఉంది. జనగణన ”మాతృభాషలనే” మాటను ఉపయోగించినప్పుడు, వాటిలో చిన్న లేదా అల్పసంఖ్యాక భాషలు మాత్రమే కాక అధిక సంఖ్యాక భాషలు కూడా ఉన్నాయనే విషయం ఎవరికైనా స్ఫురణకు రావడం అంత తేలిగ్గా జరగదు.
భారతదేశ ప్రజలు మాట్లాడిన వివిధ భాషల వివరాలు దశాబ్దాల వారీగా చూస్తే,1961లో బంగ్లా మాట్లాడేవారు మొత్తం జనాభాలో 8.7శాతం ఉండగా అర్థ శతాబ్దం తరువాత వారి సంఖ్య 8.03శాతానికి తగ్గింది. మొత్తం జనాభాలో మరాఠీ భాష మాట్లాడేవారి సంఖ్య 7.62శాతం నుండి 6.86శాతానికి, తెలుగు మాట్లాడేవారు 8.16శాతం నుండి 6.70శాతానికి, తమిళం మాట్లాడే వారి సంఖ్య మరీ దారుణంగా 6.88శాతం నుండి 5.70శాతానికి దిగజారింది. వాస్తవానికి హిందీ భాష తరువాత ఎక్కువగా మాట్లాడే మొదటి ఎనిమిది భాషలు-బంగ్లా, మరాఠీ, తెలుగు, తమిళం, గుజరాతీ, ఉర్దూ, కన్నడం, ఒడియా మొత్తం జనాభాలో 2011 జనగణన ప్రకారం 42.37శాతం కాగా హిందీ ఒక్కటే 43.63శాతంగా నమోదైంది. హిందీ మాట్లాడేవారి సంఖ్య ఎప్పుడూ పెరుగుతూనే ఉంది. 1961లో 36.99శాతంగా నమోదైన హిందీ మాట్లాడే వారి సంఖ్య 2011 నాటికి మొత్తం జనాభాలో 43.63శాతానికి పెరిగింది. హిందీ, సంస్కృతం, గుజరాతీ భాషల్ని మినహాయిస్తే మిగిలిన గుర్తించబడిన అన్ని భాషల అంతర్థానం కొనసాగుతూనే ఉందని 2011 జనగణన తెలియజేస్తుంది. 1961లో సంస్కృత భాషను మాతృభాషగా పేర్కొన్న వారి సంఖ్య 2,212 మంది కాగా 2011 లెక్కల్లో ఆ సంఖ్య 11 రెట్లు పెరిగింది. అంటే ఆ సంఖ్య 24,821కి పెరిగింది. 2011లో జరిగిన భాషా గణన వివరాలను 2018లో ప్రకటించారు.
తమిళ భాష ప్రపంచంలోనే అత్యంత పురాతన జీవభాషగా ఉంది. కన్నడం, మరాఠీ భాషలు సుమారు రెండు వేల సంవత్సరాలుగా, మళయాళం, బంగ్లా, ఒడియా భాషలు కూడా దాదాపు 1000సంవత్సరాలుగా జీవభాషలుగా ఉంటున్నాయి. సంస్కృతం దాదాపు వెయ్యి సంవత్సరాలకుపైగా జీవభాషగా లేకుండా నిలిచిపోయింది. దీనికి భిన్నంగా 17వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన ఇంగ్లీష్‌ భాష అందరి అంగీకారం పొందింది. దీనిని మాట్లాడే వారి సంఖ్య జనగణనలో 2,59,878గా చూపబడింది. ఇంగ్లీష్‌ దినపత్రికల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. భారతదేశంలో ఏడు లక్షల గ్రామాల్లో, రెండు వేల నగరాలు, పట్టణాల్లో ఇంగ్లీష్‌ మాధ్యమ పాఠశాలలు నిర్వహించ బడుతున్నాయి. ఇంగ్లీష్‌ టీవీ ఛానళ్ల రేటింగ్‌ పాయింట్లు కూడా పెరిగిపోతున్నాయి. అసలు ఇంగ్లీష్‌ మాట్లాడే వారి సంఖ్య (సంస్కృతం మాట్లాడే వారి సంఖ్యకు భిన్నంగా) పెరగుతుండడం నిజమే అని తెలుస్తుంది.
విచారకరమైన నిర్థారణ ఏమంటే భారతీయులు మాట్లాడే అల్ప సంఖ్యాక, అధిక సంఖ్యాక భాషలన్నీ (హిందూత్వ భావజాలాన్ని అనుసరించేవారు ఇష్టపడే భాషలను మినహాయిస్తే) నేడు వాటి ఉనికికి సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.మన రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా బహుభాషలు మాట్లాడే వివిధ రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న భారతదేశానికి ఇది మంచిది కాదు.
(”ఫ్రంట్‌ లైన్‌” సౌజన్యంతో)
-అనువాదం:బోడపట్ల రవీందర్‌, 9848412451

గణేష్‌ దేవీ

Spread the love