గిట్టుబాటు గిరాకీ అయితుందా..

– రైతులతో ముచ్చటించిన మంత్రి హరీశ్ రావు
– రైతుబజారును ఆకస్మిక సందర్శన
నవ తెలంగాణ – సిద్దిపేట
మీకు అనుకున్న గిరాకీ గిట్టుబాటు అవుతుందా.?  రైతుబజారులో సౌలత్ లు ఏట్లా ఉన్నాయని, ఇంకేమైనా కావాల్న.. అంటూ రైతులతో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ముచ్చటించారు. నిత్యం వేలాది మంది వచ్చిపోయే రైతు బజారును పరిశుభ్రంగా నిలపాలని, పరిశుభ్రత పాటించని ప్రదేశాన్ని చూపుతూ ఇట్లా అయితే ఏలా అంటూ ఎస్టేట్ అధికారి ప్రభాకర్ పై  మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆదివారం ఉదయం పట్టణంలోని రైతుబజారును ఆకస్మికంగా సందర్శిస్తూ.. ఫ్లోర్ కలియ తిరుగుతూ విక్రయ దారులైన రైతులతో మాట్లాడారు. ములక్కాయలు విక్రయిస్తున్న ఓ మహిళా రైతుతో ముచ్చటిస్తూ.. గిట్టుబాటు అవుతుందా.. అంటూ ఆరా తీశారు. కిలో 50 రూపాయలు ధర పలుకుతున్నదని రైతు వివరించింది. ఈ ప్రాంతంలో నీళ్లు బాగానే ఉన్నాయని సంబురంగా చెప్పింది. నేను ఐదేకరాలు ములక్కాయ పంట పెడతానని మంత్రి చెప్పుకొచ్చారు. ఇర్కోడ్ తొక్కులు, మిట్టపల్లి పప్పులు, కారం, పసుపు విక్రయ కేంద్ర నిర్వాహకులు లక్ష్మీతో మంత్రి ముచ్చటించారు. వ్యాపారం ఏలా కొనసాగుతున్నదని ఆరా తీశారు. ఇర్కోడ్ తొక్కులు, మిట్టపల్లి పప్పులు హైదరాబాదు మార్కెట్లో సైతం ఎగుమతి చేయాలని, ఇందుకు పోలీసు కమిషనర్ శ్వేత కావాల్సిన సహాయ సహకారాలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత-వేణుగోపాల్ రెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love