యాసంగి జొన్నకూ మద్దతు ధర

– ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ- హైదరాబాద్‌ బ్యూరో
రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మార్క్‌ ఫెడ్‌ను రాష్ట్ర నోడల్‌ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. 2022-23 యాసంగి సీజన్లో పండించిన జొన్న(హైబ్రిడ్‌) పంటకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు సంబంధించి మార్క్‌ ఫెడ్‌ యండీ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. యాసంగి సీజన్లో పండిన మొత్తం 65,494 మెట్రిక్‌ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ.219.92 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనుంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, కామరెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట్‌, గద్వాల్‌ జిల్లాల పరిథిలో జొన్న పంటను పండించిన దాదాపు లక్షమంది రైతులకు లబ్ది చేకూరనుంది.

 

Spread the love